హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు.. దేశానికి ఒక కొత్త దిశను అందించాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ కొనియాడారు. ఆర్థిక, వ్యవసాయ, కార్మిక, పారిశ్రామిక తదితర రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశాభివృద్ధి వేగం పుంజుకున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేటు రంగం బలపడి ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ ఎంతగానో మెరుగైందని చెప్పారు. తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో సోమవారం ‘ఇండియాస్ ఎకానమీ-రికవరీ-వే ఫార్వర్డ్’ అనే అంశంపై జరిగిన వెబినార్లో సుబ్రమణియన్ ముఖ్య అతిథిగా మాట్లాడారు.
పీవీ గొప్ప ఆర్థికవేత్త, దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మేధావి అని ప్రశంసించారు. 1991లో మొదలైన పీవీ హయాంలోని ఆర్థిక విధానాలు.. నేటికీ ఫలితాలిస్తున్నాయని గుర్తుచేశారు. కాగా, కరోనాతో ఆర్థిక రంగానికి ఎవరూ ఊహించని నష్టం జరిగిందని చెప్పారు. గడిచిన 150 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా జీడీపీ ఇంత భారీస్థాయిలో పడిపోవడం ఇదేనన్నారు. ముఖ్యంగా మైక్రో ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. అయితే సెకండ్ వేవ్ సందర్భంగా జాతీయ స్థాయిలో లాక్డౌన్ లేకపోవడం, అత్యవసర సేవలు అనుమతించడంతో అంతగా ప్రభావం పడలేదన్నారు. చిన్నతరహా పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు ఎక్కువవుతాయని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల జోరు కొనసాగుతున్నదన్నారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలన్న లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ఐపీవో, బీపీసీఎల్ ప్రైవేటీకరణలు కీలకమని వ్యాఖ్యానించారు.