రాష్ర్టాల్లో కరోనా ఆంక్షలే కారణం.. మళ్లీ పడకేస్తున్న ఆర్థిక ప్రగతి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని పట్టణాలు మరోసారి వణికిపోతున్నాయి. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు వ్యాపారాల మూసివేతకు దారితీస్తుండగా.. నిరుద్యోగం పెరిగిపోతున్నది. వలస కార్మికులూ సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ పరిణామాలు ఆర్థిక ప్రగతికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం ఈ నెల 18తో ముగిసిన వారంలో పట్టణాల్లో నిరుద్యోగ రేటు 10 శాతాన్ని దాటి 10.72 శాతంగా నమోదైంది. ఇది ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో 9.81%, 4తో ముగిసిన వారంలో 7.21 శాతంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కొద్ది నెలలు ఈ స్థాయిలోనే నిరుద్యోగం ఎగిసింది. మళ్లీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా మహారాష్ట్ర లాక్డౌన్ ఆంక్షలు తీసుకొచ్చిన దగ్గర్నుంచి పట్టణ నిరుద్యోగ రేటు పెరుగుతూ వస్తున్నది. రెండు వారాల్లో ఇది 3.5 శాతానికిపైగా పెరుగడం గమనార్హం. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో మరిన్ని రాష్ర్టాల్లోనూ లాక్డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చే వీలున్నందున పట్టణ నిరుద్యోగం ఇంకా పెరుగుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్లతోపాటు రవాణా, రెస్టారెంట్లు, మాల్స్, సెలూన్ల వంటి ఇతరత్రా సేవలపై ఆంక్షలు వచ్చిపడ్డాయి మరి. మరోవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపిస్తున్నది. ఈసారి వర్షపాతంపై ఆశాజనక అంచనాలుండటం, పంటలు బాగా పండుతాయన్న సంకేతాలుండటం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి.
అపార నష్టం: రాయ్
కొవిడ్-19 రెండో దశ నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో ఆంక్షలు వచ్చిపడుతున్నాయి. దీంతో ఆగిపోయే ఆర్థిక కార్యకలాపాలు.. పలు వ్యాపారాలను శాశ్వతంగా మూయించేలా ఉన్నాయని, లక్షలాది ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అత్యవసరం కాని వ్యాపారాలను, ఆహారేతర రిటైల్ రంగాలను, మాల్స్ను కూడా గట్టి నిఘా మధ్య నడిపించేందుకు అనుమతించాలని కోరింది. ఇప్పటికే గతేడాది లాక్డౌన్తో కోలుకోలేని నష్టం వాటిల్లిందని, ఇప్పుడు మరోసారి ఆ దెబ్బను భరించే స్థితిలో లేమని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ ఓ ప్రకటనలో అన్నారు.
జీడీపీ అంచనా కట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను దేశ వృద్ధిరేటు అంచనాను క్రిసిల్ తగ్గించింది. గతంలో 10-11 శాతంగా ఉన్న జీడీపీ అంచనా.. ఇప్పుడు 10-10.5 శాతానికి పడిపోయింది. ఆయా రాష్ర్టాలు లాక్డౌన్ బాట పడుతున్న నేపథ్యంలోనే సవరించింది. స్థానిక లాక్డౌన్ల మధ్య వాహన రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, జీఎస్టీ ఈ-వే బిల్లుల జనరేషన్కు ఇబ్బందులు తప్పవన్నది.