న్యూఢిల్లీ: గతేడాది కరోనా తొలి వేవ్ టైంలో ప్రకటించిన ఆత్మ నిర్బర్ పథకం అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం కీలక, ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విక్రయించడానికి పూనుకున్నది. నిర్దిష్ట కాలాన్ని బట్టి ఆస్తుల విక్రయించేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. నేషనల్ మానిటైజేషన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి తమ లక్ష్యాలను విపులంగా వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేలకు పేరుంది. ఇది ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతున్నది. రవాణా సేవల్లో కొంత భాగం మాత్రమే ప్రైవేటీకరించారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం రైల్వే ట్రాక్లు, ఉడ్షెడ్స్, 150 రైళ్లు, 400 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. దీంతో రూ.1.5 లక్షల కోట్ల నిధులు సర్కార్ ఖజానాకు చేరనున్నాయి.
26,700 కి.మీ. మేర జాతీయ రహదారుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటీకరిస్తారు. దీనివల్ల ఖజానాకు రూ.1.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.టెలికం రంగంలో 2.86 లక్షల కి.మీ. భారత్ నెట్ ఫైబర్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు చెందిన పైపులైన్లను విక్రయించడంతో రూ.39 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని కేంద్రం అంచనా వేస్తున్నది.
పవర్ ట్రాన్సిమిషన్కు సంబంధించి 42,300 కి.మీ. సర్క్యూట్ ట్రాన్సిమిషన్ ప్రైవేటీకరిస్తారు. దీంతో 0.67 లక్షల కోట్ల ఆదాయం లభిస్తుంది. వివిధ మార్గాల్లో 5000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ప్రైవేటీకరణతో 0.32 లక్షల కోట్లు ఆదాయం లభిస్తుంది.
8000 కిమీ నేచురల్ గ్యాస్ పైపులైన్ల ప్రైవేటీకరణతో రూ.0.24 లక్షల కోట్ల రెవెన్యూ కూడబెట్టనున్నది కేంద్రం. ఐవోసీ, హెచ్పీసీఎల్లకు చెందిన 4,000 కి.మీ పొడవు గల గ్యాస్ పైపులైన్ల విక్రయం వల్ల రూ.22 వేల కోట్లు, 25 విమానాశ్రయాల ప్రైవేటీకరణతో రూ.21 వేల కోట్లు, 9 పోర్టుల్లో 31 ప్రాజెక్టులను అమ్మేయడంతో రూ.13 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రం తలపోస్తున్నది.
160 బొగ్గు గనులు, 761 మినరల్ బ్లాక్స్ ప్రైవేటీకరణతో రూ.32 వేల కోట్లు, గోదాముల ప్రైవేటీకరణతో రూ.29 వేల కోట్లు, రెండు జాతీయ స్టేడియంల ప్రైవేటీకరణ ద్వారా రూ.11 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చునని కేంద్రం భావిస్తున్నది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించినా వాటిపై యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.