No Twitter ‘Country Head’|న్యూ ఐటీ రూల్స్ అమలు విషయమై కేంద్రంతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నది. భారత్లో కార్యకలాపాల నిర్వహణకు కంట్రీ డైరెక్టర్ను నియమించరాదని తీర్మానించుకున్నదని తెలుస్తున్నది. ప్రస్తుతం ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మనీశ్ మహేశ్వరికి అమెరికాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో కొత్త బాధ్యతలు అప్పగించింది. కీలక ఎగ్జిక్యూటివ్ల ‘లీడర్షిప్ కౌన్సిల్’ గైడెన్స్తో ట్విట్టర్ ఇండియా పని చేయనున్నదని వార్తలొచ్చాయి. ఈ లీడర్షిప్ కౌన్సిల్లోని ఎగ్జిక్యూటివ్లు ట్విట్టర్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్లకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
‘సింగిల్ కంట్రీ డైరెక్టర్కు బదులు ట్విట్టర్ ఇండియా కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీకు అద్భుతమైన ఇండియా లీడర్షిప్ కౌన్సిల్ మార్గదర్శిగా ఉంటుంది. మద్దతునిస్తుంది. జేఏపీసీ ట్విట్టర్/ ట్విట్టర్ జపాన్ వైస్ ప్రెసిడెంట్ యు-శాన్ మద్దతు మీకు ఎల్లవేళలా ఉంటుంది. మా కంపెనీకి అధిక గ్రోత్ మార్కెట్గా ఉన్న భారత్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి మా ట్విట్టర్ జేఏపీఏసీ (జపాక్) లీడర్షిప్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది’ అని ట్విట్టర్ తన ఇంటర్నల్ ఈ-మెయిల్లో పేర్కొంది.
ప్రస్తుత ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి.. సంస్థను వీడటం లేదని, అమెరికాకు వెళుతున్నారని ట్విట్టర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. నూతన మార్కెట్లోకి ప్రవేశంపై ఫోకస్ చేస్తూ రెవెన్యూ స్ట్రాటర్జీ అండ్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్గా శాన్ప్రాన్సిస్కో నుంచి నూతన బాధ్యతలు స్వీకరిస్తారని ఆ ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం ట్విట్టర్ సేల్స్ హెడ్ కనికా మిట్టల్, బిజినెస్ హెడ్ నెహా శర్మ కత్యాల్లు భారత్లో సేల్స్, రెవెన్యూ అవసరాలను పర్యవేక్షిస్తారు. వారు యు-షాన్కు రిపోర్టు చేస్తారు.
భారత ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఐటీ నిబంధనల ప్రకారం కంపెనీకి వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వానికి నెలవారీగా నివేదిక సమర్పించడానికి నోడల్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. సకాలంలో నోడల్ అధికారిని ట్విట్టర్ అమలు చేయకపోవడంతో ఆ సంస్థ ఎండీగా మనీశ్ మహేశ్వరిపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో లడఖ్ను భారత్ చిత్రపటంలో తప్పుగా చూపడం వివాదం మరింత పెరిగింది.
పలు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ కమిటీ ముందు విచారణకు ట్విట్టర్ ప్రతినిధులు హజరయ్యారు. ప్రత్యేకించి కేంద్ర ఐటీ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను తాత్కాలికంగా ఎందుకు నిలిపారన్న అంశంపై విమర్శలు ఎదుర్కొన్నది ట్విట్టర్. తాజాగా రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ట్విట్టర్ ఖాతాలను స్తంభింప చేసింది. దీంతో దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని ట్విట్టర్ తలపోస్తుందన్న అనుమానాలు ఉన్నాయి.