హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ‘తుక్కులో పెట్టుబడి పెట్టండి. భారీ లాభాలు పొందండి’ అని పలువురిని నమ్మించిన ఓ వ్యాపారి దాదాపు రూ.2 కోట్లతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో ఆ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం.. యూసుఫ్గూడ శ్రీరాంనగర్లో ఉండే మహ్మద్ అలీమ్ పాషా తుక్కు వ్యాపారం చేస్తుంటాడు. ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయని స్థానికుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. వారిలో నమ్మకం కుదిరేందుకు మొదట్లో లాభాల పేరుతో కొంత డబ్బు ఇచ్చాడు. ఆపై భారీ పెట్టుబడులు కావాలంటూ 10 మంది నుంచి రూ.1.96 కోట్లు వసూలుచేసి మూడునెలల కిందట పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేశారు.