Ratan Tata | రతన్ టాటా.. వెటరన్ పారిశ్రామికవేత్త.. ఆయన తెలియని వారు ఉండరు. వ్యాపార రంగంలో సంచలన, వినూత్న నిర్ణయాలకు పెట్టింది పేరు ఆయన. 1998లో దేశీయంగా డిజైన్ చేసిన కారు టాటా ఇండికా.. తర్వాత తొలి ఎస్యూవీ కారు టాటా సఫారీని విపణిలో ఆవిష్కరించారు.. తద్వారా.. భారత్ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో టాటా ఇండికాపై విమర్శలు వచ్చినా తర్వాత కాలంలో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, పవర్ఫుల్ ఇంజిన్ అంటూ పొగడ్తలొచ్చాయి.
కానీ.. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతాయని సామెత.. ఒకనాడు కార్ల గురించి ఏం తెలుసని రతన్టాటాను ఫోర్డ్ మాజీ చైర్మన్ బిల్ ఫోర్డ్ అవమానించినంత పని చేశారు. కానీ తొమ్మిదేండ్లకు ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిన వేళ దివాళా తీసిన ఫోర్డ్ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు రతన్టాటా.. ఫోర్డ్ ఆధీనంలో ఉన్న బ్రిటన్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను టేకోవర్ చేశారు.
1991లో ప్యాసింజర్ కార్ల తయారీ డివిజన్లోకి ఎంటరైంది టాటా మోటార్స్.. కానీ ప్రజలను పెద్దగా ఆకర్షించలేకపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో మూసేయాలని డిసిషన్ తీసేసుకున్నారు రతన్టాటా. కార్ల తయారీ డివిజన్ బిజినెస్ను అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్కు విక్రయించే విషయమై న్యూయార్క్లో సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు.
కానీ 1998లో అప్పటి ఫోర్డ్ చైర్మన్ బిల్ఫోర్ట్.. మీకేమీ తెలియకుండానే కార్ల తయారీ యూనిట్ ఎందుకు ప్రారంభించారు.. ఆ యూనిట్ను మేం కొని మీకు మంచి ఫేవర్ చేస్తామంటూ రతన్టాటా టీమ్ పట్ల అవమానకరంగా వ్యవహరించారు.
దీంతో కార్ల తయారీ యూనిట్ విక్రయించాలన్న నిర్ణయాన్ని రతన్టాటా మార్చుకున్నారు. టాటా మోటార్స్లో కార్ల డివిజన్ డెవలప్మెంట్పై ఫోకస్ చేశారు. 2004లో దక్షిణ కొరియా ట్రక్స్ సంస్థ డైవూను టేకోవర్ చేశారు. అదే ఏడాది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో టాటా మోటార్ లిస్టయింది. బస్సుల తయారీకి 2006 బ్రెజిల్ మార్కోపోలో జాయింట్ వెంచర్ ప్రారంభించారు.
సరిగ్గా తొమ్మిదేండ్ల తర్వాత ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఫోర్డ్ దివాళా తీసింది. బ్రిటన్లోని జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) అప్పట్లో ఫోర్డ్ యాజమాన్యంలోనే ఉంది. దివాళా తీయడంతో జేఎల్ఆర్ను అమ్మకానికి పెట్టింది ఫోర్డ్.
దాన్ని 230 కోట్ల డాలర్లకు టేకోవర్ చేశారు రతన్టాటా. తద్వారా ఫోర్డ్ పట్ల తన స్వీట్ రివేంజ్ తీర్చుకున్నారు. అలా టాటా మోటార్స్ సిగలో చేరిన జేఎల్ఆర్ తన మాతృసంస్థ అంటే టాటా మోటార్స్కు సిరులు కురిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
జాగ్వార్ లాండ్ రోవర్ను టేకోవర్ చేయడం ద్వారా తమకు పెద్ద మేలు చేశారని రతన్టాటాను బిల్ఫోర్డ్ కొనియాడారు. 25 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లో ఎంటరైన ఫోర్డ్.. లాభదాయకంగా లేదంటూ చాప చుట్టేయడానికి సిద్ధమైంది. జనరల్ మోటార్స్ దారిలో పూర్తిగా భారత్లో వ్యాపార లావాదేవీలు మూసేయడానికి ఫోర్డ్ నిర్ణయించుకున్నది.