Fixed Diposits | రిటర్న్స్ గ్యారంటీ హామీ కావాలంటే డెట్ ఇన్వెస్ట్మెంట్ అత్యంత ప్రజాదరణ పొందిన మదుపు మార్గం అనే అభిప్రాయం వినిపిస్తోంది. దశాబ్దాలుగా భారతీయులు గ్యారంటెడ్ రిటర్న్స్ హామీ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లోనే పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి మదుపు పథకాలైనా.. కొన్నేండ్లుగా వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టడంతో మదుపర్లకు వచ్చే రిటర్న్స్ తగ్గుతాయి. అటువంటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేముందు ఆయా బ్యాంకులు ఇచ్చే వడ్డీరేట్లను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అతిపెద్ద బ్యాంకులన్నింటిలోనూ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పడిపోయాయి. కానీ చాలా మంది తమ ఫిక్సడ్ డిపాజిట్లను అధిక వడ్డీరేటు పథకాల్లోనే చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో చూద్దామా..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేండ్ల ఫిక్సడ్ డిపాజిట్లపై ఏడు శాతం వడ్డీరేటు అందిస్తోంది. చిన్న ఫైనాన్స్ సంస్థల్లో ఉత్తమ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకు ఇదే. రూ.లక్ష మదుపు చేస్తే, మూడేండ్ల తర్వాత రూ.1.23 లక్షల రిటర్న్స్ వస్తాయి. కనీసం రూ.1000 మదుపు చేయాల్సి ఉంటుంది.
ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.21 లక్షల రిటర్న్స్ వస్తాయి.
ఆర్బీఎల్ బ్యాంక్ 6.30 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తోంది. రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే మూడేండ్లలో రూ.1.21 లక్షలు లభిస్తాయి. మరో ప్రైవేట్ బ్యాంక్ .. యెస్ బ్యాంక్ 6.25 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.20 లక్షల రిటర్న్స్ వస్తాయి. కనీస మదుపు మొత్తం రూ.10 వేలు.
ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్ మూడేండ్ల ఎఫ్డీపై ఆరు శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ.లక్ష మదుపు చేస్తే మూడేండ్లకు రూ.1.19 లక్షలు వస్తాయి. కనీస మదుపు రూ.10 వేలు.