న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కరోనా కేసుల్లో భారత్ బ్రెజిల్ను దాటేసింది. ఆదివారం కొత్తగా 1,68,912 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,35,27,717కు పెరిగింది. దీంతో భారత్ బ్రెజిల్ను వెనక్కు నెట్టి కరోనా కేసులు ఎక్కువగా నమోదైన దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. 3.11 కోట్ల కేసులతో అమెరికా తొలిస్థానంలో ఉండగా, బ్రెజిల్ 1,34,82,023 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇండియాలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 904 మంది కరోనాతో మరణించారు. దేశంలో సెకండ్ వేవ్ కారణంగా కొత్తగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా ఉంటున్నది. అదే సమయంలో కోలుకునే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య) పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,01,009 యాక్టివ్ కేసులున్నాయి. ఇవి మొత్తం కేసుల్లో 8.88 శాతం. రికవరీ రేటు 90 శాతం కంటే దిగువకు (89.86%) పడిపోయింది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రకారం మరణాల పరంగా భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత దృష్ట్యా 10,12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తరగతి పరీక్షలను మే నెల చివరి వారంలో 10వ తరగతి పరీక్షలను జూన్లో నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ చెప్పారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డులు కూడా తమ పరీక్షల తేదీలపై పునరాలోచించాల్సిందిగా కోరారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ చివరి వారం నుంచి మహారాష్ట్రలో బోర్డు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కట్టడికి హర్యానాలో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొవిడ్ పరిస్థితులు మరింత దిగజారితే, అవసరమైతే లాక్డౌన్ విధిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప చెప్పారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ… కుంభమేళాకు రెండో ‘షాహీ స్నాన్’ సందర్భంగా భక్తులు పోటెత్తారు. సోమవారం సోమవతీ అమావాస్య కావడంతో హరిద్వార్లోని గంగానదిలో లక్షలాది మంది స్నానమాచరించారు. కాషాయధారులైన సాధువులు, ఒంటినిండా భస్మంతో నాగాలు వెల్లువలా తరలివచ్చారు. వివిధ అఖాడాలకు చెందినవారు తమ మహామండలేశ్వరుల సారథ్యంలో శోభాయాత్రలు నిర్వహించారు.
గడిచిన వారం రోజుల్లో సుప్రీంకోర్టులో 44 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ ప్రభావం సుప్రీంకోర్టు కార్యకలాపాలపై పడింది. సోమవారం గంట ఆలస్యంగా విచారణలు ప్రారంభమయ్యాయి. జడ్జిలందరూ ఇంటి నుంచే విచారణ చేపట్టారు. కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్కు కరోనా పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయింది.