గాంధీనగర్: ప్రపంచంలోకెల్లా అతి చౌక స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి గుజరాత్లో జరుగనున్నదా? ఇది నిజమా అంటే.. పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. గత నెలలో జరిగిన రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా చౌక స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ నెక్ట్స్ను విపణిలో ఆవిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సెర్చింజన్ గూగుల్ సాయంతో రిలయన్స్ జియో ఈ స్మార్ట్ ఫోన్ అభివ్రుద్ధి చేస్తున్నది.
ఈ స్మార్ట్ ఫోన్ను గూగుల్- రిలయన్స్ తమ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయనున్నదని గుజరాత్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గూగుల్ అధికారులు గుజరాత్లో పర్యటించారు. స్మార్ట్ ఫోన్ ఉత్పాదక ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం అన్వేషణ జరిపారని సమాచారం.
గుజరాత్లోని ధొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను ఇటీవల గూగుల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సందర్శించినట్లు తెలుస్తున్నది. ధోలెరా ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటికే 80 శాతానికి పైగా మౌలిక వసతుల కల్పన ప్రక్రియ పూర్తయింది. ప్రపంచంలోని ఏ ఇన్వెస్టర్ అయినా ఈ రీజియన్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
కరోనా నేపథ్యంలో ఏ పెద్ద కంపెనీ గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. కోవిడ్-19 వల్లే ఈ ఏడాది వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగలేదు. దీంతో గూగుల్ను తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గుజరాత్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. అయితే, గుజరాత్లో స్మార్ట్ ఫోన్ ప్లాంట్ కోసం గూగుల్ ఎంత పెట్టుబడి పెడుతుందన్న సంగతి వెల్లడి కాలేదు.
రిలయన్స్ జియోతో కలిసి ప్రపంచంలోనే అతి చౌక స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ సీసీవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు. జియో రంగ ప్రవేశంతో లక్షల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తొలిసారి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.
శరవేగంగా 100 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ అందుబాటులోకి తేవడానికి గూగుల్- జియో 5జీ రంగంలో భాగస్వాములయ్యాయి. దీంతో భారత్ డిజిటలైజ్ అవుతుందని సుందర్ పిచ్చాయ్ వెల్లడించారు.
గూగుల్-జియో సంయుక్తంగా అభివ్రుద్ధి చేసిన ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ సేల్స్.. సెప్టెంబర్ 10న గణేశ్ చతుర్థి నాటికి మొదలవుతాయి. సాధారణ పౌరుడి బడ్జెట్ను ద్రుష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు.
జియో ఫోన్ నెక్ట్స్ ధర చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2జీ ఫోన్ వాడకం దారులందరినీ 5జీ వైపు మళ్లించడమే ముకేశ్ అంబానీ ప్రధాన లక్ష్యం
కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా.. రిలయన్స్ డిజిటల్ ఫర్మ్ జియో ప్లాట్ ఫామ్స్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు స్వీకరించింది. గతేడాది జూలైలో జియో ప్లాట్ఫామ్స్లో గూగుల్ 7.73 శాతం వాటాలను కొనుగోలుచేసింది. దీని విలువ రూ.33,737 కోట్లు.