న్యూఢిల్లీ: వేతన జీవులు, వ్యాపారులు, ఏజంట్లు ప్రతిఏటా తప్పనిసరిగా ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాల్సిందే. అయితే, ప్రతియేటా ఆదాయం పన్ను శాఖ (ఐటీ) టాక్స్-పైలింగ్ విధానంలో కొన్ని మార్పులు చేస్తూ ఉంటుంది.
తప్పులు లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఈ మార్పులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2021-22 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫామ్లను ఐటీ శాఖ నోటిఫై చేసేసింది. దీంతోపాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది.
పన్ను చెల్లింపు దారులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఫైల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో మీవైపు లోపాలు ఎత్తి చూపే అవకాశాలు తగ్గుతాయి.
దీంతో పాటు రిఫండ్ల దాఖలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయడానికి వీలు చిక్కుతుంది. పన్ను దాఖలు ప్రక్రియను ప్రారంభించడానికి ముందు వేతన జీవులు, వ్యాపారులు 4 అంశాలను గుర్తుంచుకోవాలి.
గత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినప్పుడు 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నూతన పన్ను చెల్లింపు విధానాన్ని తీసుకొచ్చారు.
2020-21 వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానాలలో తమకనుకూల పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.
కొత్త విధానంలో తక్కువ శ్లాబ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త పాలసీని ఎంచుకుంటే పాత విధానంలో వర్తించే తగ్గింపులు, మినహాయింపు ప్రయోజనాలు కొత్త పాలసీలో వదులుకోవాలి.
పాత పన్ను విధానంలో వర్తించే తగ్గింపులు, మినహాయింపు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెట్టనివారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం మంచిది.
వ్యాపారులు మరింత జాగ్రత్తగా సరైన విధానాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే పన్నువిధానాన్ని ఎంచుకున్న తరువాత ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలవుతుంది.
జీతం, ఇంటి ఆస్తి, ఇతర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ప్రతి ఏటా మార్చుకోవచ్చు.
ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆదాయం పన్నుశాఖ గడువు పొడిగించింది. కానీ అయితే పన్ను లైబిలిటీలో మాత్రం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు.
ముందస్తు పన్నుచెల్లింపులు చేయనివారు పెనాల్టీ వడ్డీ చెల్లించాలి. అందువల్ల పన్ను చెల్లించి వీలైనంత త్వరగా ఐటీఆర్ను దాఖలు చేయడం మంచిది.
ఐటీఆర్ దాఖలులో ఆలస్యం జరిగితే సెక్షన్ 234ఏ కింద ఒకశాతం చొప్పున నెలవారీ వడ్డీని వసూలు చేస్తారు.
నిర్ణయించిన తేదీల్లోపు లోబడి అడ్వాన్స్ పన్ను చెల్లించడంలో విఫలమైన ముందస్తు పన్ను చెల్లింపుదారులకు సెక్షన్ 234బీ, 234సీ సెక్లన్ల కింద వడ్డీ విధిస్తారు.
పన్ను చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించపోయినా, అంచనాలో 90 శాతం కంటే తక్కువ మొత్తాన్ని జమ చేసినా.. బకాయి ఉన్న మొత్తంపై సెక్షన్ 234బీ ప్రకారం ఒక శాతం వడ్డీ వర్తిస్తుంది.
సాధారణంగా అడ్వాన్స్ ట్యాక్స్ త్రైమాసికంగా చెల్లించాలి. వీటికి ఆదాయపు పన్ను శాఖ కొన్ని తేదీలను నిర్ణయిస్తుంది.
జూన్ 15 నాటికి మొత్తం ఆదాయంపై పన్నులో 15శాతం అడ్వాన్స్ చెల్లించాలి, సెప్టెంబర్ 15- నాటికి మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 45శాతం అడ్వాన్స్ చెల్లించాలి.
డిసెంబర్15 కల్లా మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన పన్నులో 75శాతం లెక్కించి దాని నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్ను తీసేసి మిగతా మొత్తం చెల్లించాలి.
మార్చి 15న మొత్తం ఆదాయంపై పన్ను 100 శాతం నుంచి అప్పటికే కట్టిన ముందస్తు పన్నును తీసేసి చెల్లించాలి.
వ్యాపార ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు ముందస్తు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.
పన్నుల చెల్లింపులో మార్పులకు అనుగుణంగా ప్రతి ఏటా ఐటీ శాఖ కొత్త ఐటీ ఫారంలను రూపొందిస్తుంది. ఈ ఏడాది కూడా ఐటీఆర్-1 అర్హత ప్రమాణాలలో కొన్ని మార్పులు చేశారు.
ఐటీఆర్-1ను సాధారణంగా జీతం ద్వారా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులు ఉపయోగిస్తారు.
ఐటీ చట్టంలోని 194ఎన్ సెక్షన్ కింద నగదు విత్డ్రా కోసం టీడీఎస్ డిడక్ట్ చేసిన వ్యక్తులు లేదా యజమాని నుంచి ఈఎస్ఓపీపై డిపర్డ్ ట్యాక్స్ పొందిన వారు ఐటీఆర్ 1 దాఖలు చేయకూడదు.
మినహాయింపు పెట్టుబడుల ఆధారాలను యజమానికివ్వడంలో విఫలమైతే పన్ను డిడక్ట్ అవుతుం ది. ఐటీఆర్ దాఖలు చేసేప్పుడు క్లెయిమ్ చేసి, చెల్లించిన పన్ను వాపసు పొందవచ్చు.
ఈ సంవత్సరం వడ్డీ ఆదాయం, షేర్లపై డివిడెండ్, మ్యూచువల్ ఫండ్లు, షేర్లపై వచ్చిన మూలధన లాభాలు తదితరాల సమాచారం ఐటీఆర్ ఫారంలలో ఐటీశాఖ నిక్షిప్తం చేస్తుంది.
తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ సమాచారాన్ని మీ వద్ద ఉన్న పత్రాలతో పోల్చి చూసుకోవాలి. ఇందుకోసం ఫారం 16, ఫారం 26ఏఎస్ వంటి పత్రాలను, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీఆర్ ఫైల్లింగ్కు ముందే సేకరించుకోవాలి.
ఫారం 26ఏఎస్లో టీడీఎస్, టీసీఎస్లు జూలై 15 నాటికి వారి వారి ఫారం 26ఏఎస్లో అప్డేట్ అవుతాయి. అప్పటి వరకు మదింపుదారులు వేచి ఉండాలి.
టీడీఎస్, టీసీఎస్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. అందువల్ల జూలై 15 లోపు ఫారం 26ఏఎస్లో అప్డేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఐటీఆర్ను ధృవీకరించే వరకు పన్ను దాఖలు ప్రక్రియ పూర్తికాదు. ఐటీఆర్ దాఖలు చేసిన నాలుగు నెలల్లో ఇది జరగాలి. ఆన్లైన్లో లేదా, సంతకం చేసిన ఐటీఆర్ -5 పోస్ట్ చేయడంతో ధృవీకరించవచ్చు.