ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులుగా దూసుకుపోయిన సూచీలు.. బుధవారం డీలాపడ్డాయి. నిజానికి ఉదయం ఆరంభంలో మార్కెట్లు భారీ లాభాల్లోనే కదలాడాయి. కొనుగోళ్ల జోరుతో కొత్త శిఖరాలను తాకాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 56వేల మార్కును అధిగమించగా, ఒకానొక దశలో 56,118.57 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. ఫలితంగా మదుపరుల సంపద కూడా రూ.242 లక్షల కోట్లను దాటేసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మునుపెన్నడూ లేనివిధంగా 16,701.85 స్థాయికి వెళ్లింది. అయితే మదుపరుల లాభాల స్వీకరణతో ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో చివరకు సెన్సెక్స్ 162.78 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 55,629.49 వద్ద ముగియగా, నిఫ్టీ 45.75 పాయింట్లు లేదా 0.28 శాతం క్షీణించి 16,568.85 వద్ద నిలిచింది.
రూపాయి పెరిగినా..
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 11 పైసలు ఎగబాకి 74.24 వద్దకు చేరినా మార్కెట్ సెంటిమెంట్ బలపడలేకపోయింది. సూచీలు మరో సరికొత్త రికార్డుకు చేరిన నేపథ్యంలో లాభాలను తీసుకునేందుకే ఆసక్తి చూపారని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషించారు. సెన్సెక్స్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 2.09 శాతం పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ షేర్లూ నష్టాలకే పరిమితమయ్యాయి. కాగా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో తదితర షేర్లు 2.46 శాతం లాభాలను పొందాయి. మొత్తంగా సెన్సెక్స్ 30 షేర్లలో 20 నష్టపోగా, 10 లాభపడ్డాయి. రంగాలవారీగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్, ఐటీ, ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో.. ఎఫ్ఎంసీజీ, చమురు, గ్యాస్, విద్యుత్తు షేర్లు లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ మిడ్-క్యాప్ 0.26 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ 0.18 శాతం తగ్గింది.
నేడు మార్కెట్లకు సెలవు
మొహర్రం సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు. శుక్రవారం యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తెలిపాయి.