బేగంపేట్ జూన్ 8: కొవిడ్ బారిన పడటంతోపాటు మెదడులో భారీ క్యాన్సర్ కణితితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చైత్రిక (4) అనే చిన్నారికి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వైద్యులు ‘పునర్జన్మ’ ప్రసాదించారు. తొలుత కొవిడ్ను నయం చేసిన వైద్యులు.. ఆ తర్వాత సంక్లిష్టమైన శస్త్రచికిత్సతో విజయవంతంగా క్యాన్సర్ కణితిని తొలగించి ఆ చిన్నారి ప్రాణాలను నిలబెట్టారు. వివరాల్లో కెళ్తే.. కామారెడ్డి జిల్లా భవానీపేటకు చెందిన పుల్లూరి కిషన్ కుమార్తె చైత్రిక గత 5 నెలల నుంచి తరచుగా వాంతులతో బాధపడుతున్నది. రాత్రిళ్లు నిద్రలేక తీవ్రంగా నీరసించిన ఆ చిన్నారి కనీసం కుడిచేతితో గ్లాస్ను కూడా ఎత్తలేని స్థితికి చేరింది. ఈ సమస్యపై స్థానిక వైద్యులను సంప్రదించినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో కిషన్ తన బిడ్డను సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానకు తీసుకొచ్చారు.
కిమ్స్లో చైత్రికకు వైద్య పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. మెదడులోని ఇన్సులా అనే భాగానికి (కాలు, చేయిని నియంత్రించే భాగానికి) ఈ ట్యూమర్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మెదడులో 30 శాతం భాగాన్ని ఆక్రమించిన ఈ భాగాన్ని తొలగించడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. శస్త్రచికిత్స చేసే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఉంటుంది. మరోవైపు చైత్రికకు కరోనా కూడా సోకినందున సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేయకపోతే ఆ చిన్నారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాక్టోగ్రఫీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చైత్రిక మెదడు కదలికలను గుర్తించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు డాక్టర్ మానస్ పాణిగ్రాహి తెలిపారు.