పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతున్నది. ఓట్లు అధికంగా నమోదుకావడం, ప్రాధాన్యత క్రమంలో వేరు చేయాల్సి ఉండడంతో ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కౌంటింగ్లో భాగంగా తొలుత బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్ కట్టారు. ఒక్కో రౌండ్లో ఓట్లు సరిపోల్చి బండిల్స్గా కట్టేందుకు గంటన్నర పట్టింది. 799 బాక్సులలో పేపర్లను రాత్రి వరకు కట్టలు కట్టడం పూర్తికాగా, అర్ధరాత్రి తర్వాత మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో రౌండ్లో 56 వేల ఓట్ల చొప్పున 7 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉండడం, ప్రతి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని ? చెల్లనివి ఎన్ని? ఇలా క్షుణ్ణంగా పరిశీలిస్తుండడంతో ప్రక్రియ ఆలస్యమవుతున్నది. చెల్లిన ఓట్లలో సగం కంటే ఒకటి (మొదటి ప్రాధాన్యత) ఎక్కువగా వస్తే..ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకుంటే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇలా జరిగితే శుక్రవారం ఫలితం వెల్లడికానుంది.
హైదరాబాద్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా సాగుతున్నది. సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న లెక్కింపు ప్రక్రియలో భాగంగా బుధవారం ఉదయం 6. 30 గంటలకు ఎన్నికల పరిశీలకులు హరిప్రీత్సింగ్, రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల, అభ్యర్థుల సమక్షంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ స్ట్రాంగ్ రూమ్లను తెరిచారు. 7.30 గంటల వరకు అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ల సీల్ పరిశీలన ఆనంతరం బ్యాలెట్ బాక్స్లను సిబ్బంది కౌంటింగ్ టేబుళ్లపైకి తరలించారు. ఉదయం 8 గంటలకు జంబో బాక్స్లోని బ్యాలెట్ పేపర్లను డ్రమ్ములో కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్స్ కట్టారు. నియోజకవర్గం పరిధిలోని 799 పోలింగ్ బూత్లుండగా, 15 రౌండ్లలో బాక్స్ల్లో నుంచి తీసిన ఓట్ల లెక్కింపు (పోలింగ్ అకౌంట్), బండిల్స్ కట్టడం చేశారు. ఒక్కో టేబుల్పై ఒక బూత్ బాక్స్ను తెరిచి పోలైన ఓట్లు, బ్యాలెట్ పత్రాలు సమానంగా ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలించారు. ఆనంతరం వాటిని 25 చొప్పున బండిల్స్గా కట్టారు.
ఒక్కో రౌండ్లో ఓట్లు సరిపోల్చి బండిల్స్గా కట్టేందుకు గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. అర్ధరాత్రి వరకు బండిల్స్ కట్టే ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా బండిల్స్ కట్టే కార్యక్రమం సాగింది. కాగా కొన్ని బాక్స్లకు తాళాలు ఓపెన్ కాకపోవడంతో వాటిని ఏజెంట్ల సమక్షంలో కట్ చేశారు. బండిల్స్ కట్టే ప్రక్రియలో స్వతంత్రులు కొన్ని అభ్యంతరాలు తెలుపగా అధికారులు వారికి సర్ధి చెప్పి పరిస్థితిని యథాస్థితిని తీసుకువచ్చారు.
నియోజకవర్గం పరిధిలోని 5.31 లక్షల ఓట్లకు గానూ 3,57,354 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది కొత్త జిల్లాల పరిధిలో 3,550 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లుగా గతంలోనే అధికారులు ప్రకటించారు. చెల్లుబాటయ్యే ఓట్లను సాధారణ బ్యాలెట్ పత్రాల్లో కలిపారు. సాధారణ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముందుగా ఉండదని, అన్ని ఓట్లు కలిపి లెక్కిస్తామని అధికారులు తెలిపారు.
ఎన్నికల లెక్కింపులో భాగంగా ఎనిమిది హాల్స్లో ఒక్కో హాల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. టేబుల్కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నది. బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక్కో టేబుల్పై 1000చొప్పున ప్రతి రౌండ్లో 56 వేల ఓట్లను లెక్కిస్తున్నారు. బరిలో 93 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రతి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయి? చెల్లని ఓట్లు ఎన్ని? ఇలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జంబో బ్యాలెట్ పేపర్ అయినందున ఒక్కో బ్యాలెట్ పత్రాన్ని పరిశీలించేందుకు దాదాపు 2-3 నిమిషాల వ్యవధి పడుతుంది. దీంతో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ సిబ్బందిని షిఫ్టులవారీగా నియమిస్తూ నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఒక్కో షిప్టు 12 గంటల చొప్పున రెండు విడుతల్లో సిబ్బంది పనిచేస్తున్నారు. 12 గంటల పాటు పనిచేసిన వారు విశాంత్రి తీసుకొని మళ్లీ 12 గంటల తర్వాత వారు తిరిగి విధుల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఒక ఓటు (మొదటి ప్రాధాన్యత) ఎక్కువగా వస్తే..ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. తక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తే వారికి వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్యతను ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అలా దిగువ నుంచి ఎగువకు ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తూ కోటా ఓట్లు ఎవరికైనా వచ్చే దాకా కౌంటింగ్ను కొనసాగిస్తారు. ఈ క్రమంలో కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒక ఓటు) ఓట్లు ఏ అభ్యర్థికైనా వచ్చినట్లయితే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కాగా రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే మాత్రం కౌంటింగ్ పూర్తయ్యేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.