న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల సామాన్యుడి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దీనికి తోడు నిరుద్యోగం, కఠిన ఆంక్షలతో ఆదాయం స్తంభించి పోయింది. దీనికి తోడు కరోనా సోకిన కుటుంబాలు చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఉద్యోగాలు లేక, ఆదాయం రాకపోగా, కోవిడ్ మహమ్మారి అటాక్ కావడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.
ఈ పరిస్థితుల్లో రోజువారీగా కుటుంబాల నిర్వహణకు సగటు పౌరులు తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలపై రుణాలు తీసుకోవడం గానీ, పూర్తిగా విక్రయించడం గానీ చేస్తున్నారు. గత మే నెలలో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. మే నాటికి గత 12 నెలల్లో ఇతర రంగాల రుణాల కంటే ఎక్కువ.
గతేడాది మే నెల నుంచి ఈ ఏడాది మే నాటికి బంగారంపై సామాన్యులు తీసుకున్న రుణాల విలువ రూ.15,686 కోట్లు పెరిగాయి. 2020 మే నెలలో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెలలో రుణాలు రూ.62,101 కోట్లకు పెరిగాయి. గత మార్చిలో బంగారం తాకట్టు పెట్టి 25.9 లక్షల మంది రుణాలు తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలో బంగారంపై గతేడాది (2020-21) సామాన్యులు తీసుకున్న రునాలు 465 శాతం పెరిగాయి. తక్కవ ఆదాయ కుటుంబాలు, గ్రామీణులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగి పోవడంతో బంగారం రుణాలకు డిమాండ్ పెరిగింది. ఎస్బీఐలో బంగారంపై రుణాలకు 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. రూ.20,987 కోట్ల మేరకు బ్యాంకు బంగారంపై రుణాలిచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. జైపూర్, రత్లాం, ఇండోర్ బులియన్ మార్కెట్ల పరిధిలో రైతులు పంటల సాగు, రోజువారీ ఇతర అవసరాలను తీర్చుకోవడానికి బంగారం అమ్మడం లేదా తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు.
మే నెలలో పర్సనల్ లోన్ సెగ్మెంట్ కూడా 12.4 శాతం పెరిగింది. 2020 మేలో ఇది 10.6 శాంగా ఉండేది. దేశంలోకి గతేడాది మార్చిలో కరోనా ఎంటరైన దగ్గర్నుంచి గోల్డ్ ఔట్ స్టాండింగ్ లోన్స్ 86.4 శాతం పెరిగాయి.