ముంబై : తౌక్టే తుఫాన్ మహా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ముంబై తీరం వద్ద ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయాయి. ఇంతకీ బార్జ్లను ఏమంటారో తెలుసుకుంది. బార్జ్ అంటే బోటు లాంటిది. కానీ ఇది చాలా ఫ్లాట్గా ఉంటుంది. నదులు, కాలువల్లో భారీ సరుకు రవాణా కోసం వినియోగిస్తుంటారు. అయితే ముంబై తీరంలో తాజా తుఫాన్కు నాలుగు బార్జ్లు ఉక్కిరిబిక్కిరయ్యాయి. చిన్నపాటి ఆశ్రయ కేంద్రాలుగా కూడా ఈ బార్జ్లు పనిచేస్తుంటాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) వద్ద డ్రిల్లింగ్ కోసం పనిచేసే వాళ్లు పీ305 అనే బార్జ్లో ఉన్నారు. ఆ బార్జ్లో సుమారు 261 మంది ఉన్నట్లు తెలిసింది. కానీ తౌక్టే తుఫాన్ తాకిడికి అది మునిగినట్లు అధికారిక సమాచారం. ఇప్పటి వరకు దాంట్లో ఉన్న 177 మందిని రక్షించారు. మిగితా 127 మంది మాత్రం మిస్సింగ్ జాబితాలో ఉన్నారు. వారి కోసం అన్వేషిస్తున్నారు.
సాధారణంగా బార్జ్లకు పవర్ సప్లై ఉండదు. వాటిని టగ్బోట్ల సహాయంతో కదిలిస్తారు. ఇక ముంబై తీరంలో తౌక్టే తుఫాన్ మహా ప్రతాపం చూపించడంతో.. నాలుగు బార్జ్లు స్థానం చలనం చెందాయి. కోస్టు గార్డు, నేవీ సిబ్బంది.. పీ305 బార్జ్లో కొందర్నీ రక్షించినా.. మిగితా బార్జ్ల్లో ఉన్న వారి రక్షణ కోసం చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నాలుగు బార్జ్ల్లో సుమారు 800 మంది ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ కచ్చితమైన లెక్క మాత్రం లేదు. బార్జ్ గాల్ కన్స్ట్రక్టర్లో సుమారు 137 మంది ఉన్నారు. వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బార్జ్ SS-3, ఆయిల్ రిగ్ సాగర్ భైషణ్లు కూడా కొట్టుకుపోయాయి. వాటిల్లో ఉన్నవారిని రక్షించేందుకు యుద్ధనౌకలు బయలుదేరాయి.