న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలు తగ్గించే ఆలోచనేదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై ఇంపోర్ట్ సుంకం తగ్గించాలని ఇటీవల గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో టెస్లా కంపెనీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలు తగ్గించే ప్రణాళికేమీ లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కృషన్ పాల్ గుర్జార్ పేర్కొన్నారు.
దేశీయ పన్నులను తగ్గించడంతోపాటు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ కార్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సోమవారం పార్లమెంట్కు తెలిపారు.
ప్రస్తుతం దిగుమతి చేసుకున్న విద్యుత్ కార్లపై 60-100 శాతం కేంద్రం సుంకం విధిస్తున్నది. దీన్ని 40 శాతానికి కుదించాలని టెస్లా కోరుతున్నది.