ముమ్మరంగా వాహనాల తనిఖీలు
పెద్దేముల్, జూన్ 6 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలు కొనసాగుతున్నది. ప్రతి రోజూ ఉదయం మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపార దుకాణాలు, హోటళ్లు, ఇతర దుకాణాలు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 2 తరువాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహానాలను పోలీసులు తనిఖీలు చేసి జరిమానాలను విధించారు. ఆయా గ్రామాల్లో ఎస్సై చంద్రశేఖర్ ఎప్పటికప్పుడు లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. మండల కేంద్రంలో ఏఎస్సై నారాయణ, ఇతర పోలీసు సిబ్బంది తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. మరోవైపు తాండూరు-హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అన్ని దుకాణాలు మూతపడగా, ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అత్యవసర సర్వీసులకు తప్ప వేరే ఇతర వాహనాలను పోలీసులు రోడ్లపై అనుమతించలేదు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.