న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో టాటా సన్స్ అనుబంధ కంపెనీ టాటా పవర్ భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. రెండు సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పంద చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని సమాచారం.
టాటాసన్స్ విద్యుత్ రంగ సంస్థ టాటా పవర్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ వసతుల కల్పనపై కేంద్రీకరించింది. ఇంతకుముందే ఇతర ఆటోమొబైల్ సంస్థలతో కలిసి దేశంలోని ప్రముఖ నగరాల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది టాటా పవర్. చార్జింగ్ వసతుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తమ మధ్య భాగస్వామ్య ఒప్పందం విషయమై జరుగుతున్న చర్చల గురించి స్పందించడానికి టాటా పవర్, టెస్లా నిరాకరించాయి.
ఈ ఏడాది చివరిలోగా భారత మార్కెట్లో టెస్లా తన మోడల్ త్రీ ఎలక్ట్రిక్ సెడాన్ కారుతో అడుగు పెట్టనున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలికంగా అవసరమైన చార్జింగ్ వసతుల కల్పనపైనా టెస్లా ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టాటా పవర్తో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తొలుత టాటా పవర్ ఈ వార్తలను ఖండించింది.
టెస్లాతో ఒప్పందం కుదరనున్నదని వార్తలు రావడంతో టాటా పవర్ షేర్ 2013 జూన్ 9 తర్వాత 5.5 శాతం పెరిగింది. మోడల్ త్రీ సెడాన్ కారును దిగుమతి చేసుకుని భారత విపణిలోకి దూసుకెళ్లాలని తలపోస్తున్న టెస్లా.. కర్ణాటకలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ స్థాపించడానికి ఏర్పాట్లు చేస్తున్నది.