హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వస్తువును తయారీదారు నుంచి నేరుగా వినియోగదారుడికి చేరవేసే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ.. గడిచిన నాలుగేండ్లలో భారీగా బలపడింది. 2016-17లో రూ.10 వేల కోట్ల విక్రయాలు చేసిన ఈ పరిశ్రమ.. 2019-20లో రూ.16,776 కోట్ల అమ్మకాలను తాకింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 12వ స్థానానికి చేరింది. ఈ పరిశ్రమపై దేశీయంగా 7.4 కోట్ల మంది, తెలంగాణలో 90 వేల మంది ఆధారపడ్డట్లు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) వెల్లడించింది. ఇక్కడ ‘బంగారు తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ సమ్మేళనం’ నిర్వహించింది. 2019-20కిగాను ఐడీఎస్ఏ వార్షిక నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్, ఐడీఎస్ఏ ఉపాధ్యక్షుడు రజత్ బెనర్జీ, ట్రెజరర్ వివేక్ కటోచ్, జీఎం చేతన్ భరద్వాజ్లు పాల్గొన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ను ప్రోత్సహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలోనే చెప్పిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ప్రకాశ్ గుర్తుచేశారు.
అదనపు ఆదాయం..
దేశీయంగా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నవారిలో 45 శాతం మంది తాము అదనపు ఆదాయం కోసం దీన్ని ఎంచుకున్నామని ఐడీఎస్ఏ సర్వేలో చెప్పారు. 20 శాతం మంది స్వీయ ఉపాధి కోసం, మరో 20 శాతం మంది ప్రజలతో మమేకమయ్యేందుకు, 6 శాతం మంది తమకు కుదిరిన సమయంలోనే పని చేయొచ్చన్న ఉద్దేశంతోనే చేస్తున్నామన్నారు. 3 శాతం మంది చౌక ధరలు, తక్కువ రిస్క్ ఉంటుందని, 2 శాతం మంది ఉద్యోగం కోల్పోయి ఈ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. దక్షిణాది రాష్ర్టాల ఆదాయంలో 13.15 శాతం వాటాతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నది. గడిచిన ఏడాది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా రాష్ట్రంలో రూ.292.5 కోట్ల విక్రయాలు జరిగాయి. ఎక్కువగా అమ్ముడవుతున్న వస్తూత్పత్తుల్లో వెల్నెస్, కాస్మటిక్స్, గృహోపకరణాలు, ఆహారం, పానీయాలు, హోంకేర్వి ఉన్నాయి.
‘2025 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుపుతాం. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో ఈ తరహా కంపెనీల నమోదు ప్రక్రియను సులభతరం చేస్తాం. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సేవలు అందించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’
–జయేశ్ రంజన్రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి