మేడ్చల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎగుమతుల ఉత్పత్తుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ ఎగుమతులతో ఆర్థికంగా వివిధ పరిశ్రమలు మరింతగా నిలదొక్కుకునేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. కాగా, రకరకాల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్న మేడ్చల్ జిల్లా.. తెలంగాణ రాష్ట్రంలోనే ఎగుమతుల పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. ఏరోస్పేస్, డ్రిల్లింగ్ మైనింగ్ పరికరాలు, ఫార్మా, బయోటెక్, విత్తనాలు, ఆహార పదార్థాలను అమెరికా, బ్రెజిల్, జర్మనీ, బ్రిటన్, రష్యా, చైనా, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఇక్కడి కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24న పారిశ్రామికవేత్తలతో మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఇండస్ట్రియలిస్ట్ అసోసియేషన్ భవనంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరుగనున్నది. కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్లో ఉత్పత్తుల పెంపు, పరిశ్రమలకు ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహంపై ప్రధానంగా చర్చ జరుగనున్నది. మేడ్చల్ జిల్లా నుంచి వివిధ దేశాలకు గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.12,062 కోట్ల విలువైన ఎగుమతులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.14,775 కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వచ్చా యి. దీంతో 2.25 లక్షల మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కాయి.
‘విదేశీ ఎగుమతులను పెంచేందుకు పారిశ్రామికవేత్తలతో ఈ నెల 24న సమావేశం నిర్వహించనున్నాం. ఉత్పత్తి మరింత పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఎగుమతుల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను పారిశ్రామికవేత్తలకు వివరిస్తాం. ప్రభుత్వం అందించే సహకారంపై సంబంధిత ఉన్నతాధికారులు వారికి తెలియజేస్తారు’
రవీందర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి