టీసీఎస్ @ 3

ప్రపంచ టాప్ ఐటీ బ్రాండ్లలో మూడో స్థానం
యాక్సెంచర్, ఐబీఎం సరసన చోటు
న్యూఢిల్లీ, జనవరి 27: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో ఘనత సాధించింది. ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో మూడో స్థానానికి ఎగబాకి కొత్త అధ్యాయన్ని లిఖించింది. తద్వారా యాక్సెంచర్ (26 బిలియన్ డాలర్లు), ఐబీఎం (16.1 బిలియన్ డాలర్లు) కంపెనీల తర్వాత నిలిచింది. ప్రపంచ టాప్-10 ఐటీ బ్రాండ్ల జాబితాలో టీసీఎస్తోపాటు భారత్కు చెందిన ఇన్ఫోసిస్ (4వ ర్యాంక్), కాగ్నిజెంట్ (5వ ర్యాంక్) హెచ్సీఎల్ (7వ ర్యాంక్), విప్రో (9వ ర్యాంక్) కూడా చోటు దక్కించుకున్నాయి. అలాగే టెక్ మహీంద్రా బ్రాండ్ విలువ 11% వృద్ధి చెంది 2.3 బిలియన్ డాలర్ల (రూ.16,786 కోట్ల)కు చేరడంతో ఆ కంపెనీ 15వ ర్యాంకును దక్కించున్నదని తాజా నివేదికలో ‘బ్రాండ్ ఫైనాన్స్' వెల్లడించింది. ఇటీవలి కాలంలో టీసీఎస్ బ్రాండ్ విలువ 11 శాతం వృద్ధి చెంది 15 బిలియన్ డాలర్ల (రూ.1,09,426 కోట్ల)కు చేరిందని, దీంతో ఐబీఎంకు టీసీఎస్ మరింత చేరువైందని ఆ నివేదిక తెలిపింది. టీసీఎస్ అందజేస్తున్న కోర్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు డిమాండ్ పెరగడంతో ఆదాయంలో బలమైన వృద్ధి నమోదైందని, అంతేకాకుండా గతేడాది చివరి త్రైమాసికంలోనే 6.8 బిలియన్ డాలర్ల (రూ.49,616 కోట్ల) విలువైన ఒప్పందాలను కుదుర్చుకోవడం కూడా టీసీఎస్ బ్రాండ్ విలువ వృద్ధికి ఎంతో దోహదం చేసిందని ‘బ్రాండ్ ఫైనాన్స్' వివరించింది.