అన్ని పరిశ్రమలలో ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్వేర్ సంస్థలు వేగంగా
ఆటోమేషన్కు మారిపోతున్నాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం దేశీయ సాఫ్ట్వేర్ రంగంలో 1.6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇందులో అత్యధికంగా జీతాల రూపంలో ఏడాదికి 100 బిలియన్ డాలర్లను కంపెనీలు ఆదా చేసుకోవడానికి ఇది సహాయపడుతుందని అందులో పేర్కొంది. నాస్కామ్ ప్రకారం.. ఐటీ రంగంలో సుమారు 16 మిలియన్ల మంది ఉద్యోగులు ఉండగా, అందులో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు, బీపీవో రంగంలో పనిచేస్తున్నారు.
దిగ్గజ ఐటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఇతర కంపెనీలు రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) అప్స్కిల్లింగ్ కారణంగా 2022 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను 3 మిలియన్ల మేర తగ్గించాలని యోచిస్తున్నాయి.