న్యూఢిల్లీ : కొవిడ్-19తో బాధపడుతూ తన అమ్మమ్మ మరణించిందనే వార్త చెవినపడ్డా ఆ నర్సు కరోనా రోగులను విడిచివెళ్లేందుకు ఇష్టపడక అంత్యక్రియలకు దూరమయ్యారు. ఎయిమ్స్ లోని కొవిడ్ వార్డ్ లో నర్సుగా పనిచేస్తున్న రాఖీ జాన్ తన అమ్మమ్మను కరోనా బలి తీసుకుందనే వార్త విన్నా కొవిడ్ రోగుల బాగోగులు చూసేందుకు బాధను దిగమింగుకుని దవాఖానలోనే ఉండిపోయింది. తాను ఏడాది వయసులో తల్లిని కోల్పోతే అమ్మమ్మే తనకు అండగా నిలిచి పెంచిందని జాన్ కంటతడి పెట్టారు.
కేరళకు చెందిన జాన్ అమ్మమ్మ కరోనాతో మరణించినా అక్కడికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అమ్మమ్మ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని హెల్త్ కేర్ సిబ్బంది సెలవులు తీసుకోవడం ప్రారంభిస్తే రోగుల ఆలనాపాలనా ఎవరు చూస్తారని రేఖ జాన్ ప్రశ్నించడం తన బాధ్యత పట్ల ఆమె నిబద్ధత ఏపాటిదో వెల్లడిస్తోంది. తనకు ఏడాది వయసున్న కూతురు ఉందని, మెటర్నటీ లీవ్ తర్వాత ఇదే తన తొలి కొవిడ్ డ్యూటీ అని రేఖ జాన్ చెప్పుకొచ్చారు. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలుతుండటంతో ప్రజలంతా మాస్క్ ధరించి కొవిడ్ ప్రోటోకాల్స్ ను పాటించాలని ఆమె కోరుతున్నారు.