రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వర జలాలతో సిరిసిల్ల నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ నింపాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ సంబంధించి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ ద్వారా తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాలకు కాళేశ్వరం జలాలు వస్తాయని చెప్పారు. ఎగువ మానేరును పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండుటెండల్లోనూ ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకించే అవకాశం కాళేశ్వర ప్రాజెక్టుతో కలుగుతుందన్నారు. ఒకవైపు ప్రధాన కాలువల ద్వారా చెరువులను నింపుతూనే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ ప్రక్రియపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ను ఫోన్లో ఆదేశించారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించా రు. క్షేత్ర స్థాయిలో పర్యటనకు ఇరిగేషన్ అధికారులను తీసుకుని వెళ్లాలని తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.