న్యూఢిల్లీ, జూన్ 25: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వివిధ ఆదాయ పన్ను (ఐటీ) గడువులను పొడిగించింది. ఈ క్రమంలోనే కొవిడ్-19 చికిత్స కోసం ఉద్యోగులకు సంస్థ చేసే చెల్లింపులకు ఐటీ మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక ఈ మహమ్మారితో ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు సంస్థల నుంచి వచ్చే ఎక్స్గ్రేషియాలకూ ఆదాయ పన్ను వర్తించబోదని ఓ ప్రకటనలో ఐటీ శాఖ స్పష్టం చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంతోపాటు తర్వాతి సంవత్సరాలకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ఇతర వ్యక్తుల నుంచి ఈ తరహా ఎక్స్గ్రేషియా అందితే అప్పుడు రూ.10 లక్షల వరకే ఐటీ మినహాయింపు వర్తిస్తుందని చెప్పింది. కరోనా వైద్య చికిత్స నిమిత్తం ఉద్యోగులు వారి సంస్థల నుంచి, సన్నిహితుల నుంచి సాయం పొందుతున్నారని, దానిపై పన్ను భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ట్యాక్స్ పేయర్స్ కోసం..
కరోనా పరిస్థితుల మధ్య పన్ను చెల్లింపుదారులు వివిధ ఐటీ రూల్స్ ఆచరణకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అందుకే వాటి గడువులను పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా సీబీడీటీ ప్రకటించింది. ఫామ్ 15సీసీ, ఈఎల్ఎస్లకు సంబంధించిన గడువులనూ పెంచారు. రెసిడెన్షియల్ హౌజ్ ప్రాపర్టీ అమ్మకంపై వచ్చిన మూలధన లాభాలకు సంబంధించిన పన్ను మినహాయింపులకున్న వెసులుబాట్లనూ పొడిగించారు.