కొందామనుకుంటున్నాం: టాటా స్టీల్ ఎండీ నరేంద్రన్
ముంబై, ఆగస్టు 17: విశాఖపట్నంలో ఉక్కు ప్లాంటును నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్)ను టేకోవర్ చేయడానికి టాటాలు ఆసక్తి వ్యక్తపర్చారు. ఆర్ఐఎన్ఎల్లో 100 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ఏడాది జనవరిలో సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ తమకు వైజాగ్ స్టీల్ను కొనుగోలుచేసే ఉద్దేశ్యం ఉందన్నారు. తాము స్టీల్ లాంగ్ ప్రొడక్టుల వ్యాపారాన్ని వృద్ధిపర్చుకోవడానికి ఆర్ఐఎన్ఎల్ టేకోవర్ గొప్ప అవకాశమని, ప్లాంటు దక్షిణాదిన, పైగా తూర్పుతీరంలో ఉన్నందున పలు ప్రయోజనాలున్నాయని ఆయన వివరించారు.
73 లక్షల టన్నుల సామర్థ్యం..
వైజాగ్ స్టీల్ ప్లాంటుకు 73 లక్షల టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉంది. అలాగే 22,000 ఎకరాల స్థలాలు ఉన్నాయి. కొకింగ్ కోల్ వంటి ముడిసరుకుల దిగుమతికి గంగవరం పోర్టు కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాంటును కొనుగోలుచేయడంవల్ల తమకు ఆగ్నేయాసియా మార్కెట్లకు ఉత్పత్తుల్ని ఎగుమతుల్ని పెంచుకోగలుగుతామని నరేంద్రన్ తెలిపారు.
నీలాచల్ ఇస్పాత్కు ఈవోఐ
ఒడిశాలోని ఉక్కు కంపెనీ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్) కొనుగోలుకూ తాము ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్ను సమర్పించామని నరేంద్రన్ వెల్లడించారు. నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రెండు ఒడిశా ప్రభుత్వ సంస్థల మధ్య జాయింట్ వెంచర్గా ఎన్ఐఎన్ఎల్ నడుస్తున్నది. ఈ కంపెనీని డిజిన్వెస్ట్చేయడానికి 2020లో కేంద్రం అనుమతినిచ్చింది.