టాటా స్టీల్ బ్లాక్చైన్ లావాదేవీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్.. ప్రముఖ బహుళజాతి ఆర్థిక సంస్థ హెచ్ఎస్బీసీతో కలిసి బ్లాక్చైన్ టెక్నాలజీ ఆధారిత వాణిజ్య లావాదేవీ నిర్వహించింది. ప్రపంచ ఉక్కు రంగంలో ఇలాంటి లావాదేవీ జరగడం ఇదే తొలిసారి. బ్లాక్చైన్ ప్లాట్ఫామ్పై విజయవంతంగా ఈ లావాదేవీ జరిగిందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన యూనివర్సల్ ట్యూబ్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ సంస్థకు ఉక్కును ఎగుమతి చేసేందుకు ఈ లావాదేవీని నిర్వహించామని టాటా స్టీల్ స్పష్టం చేసింది. అయితే ఈ లావాదేవీ విలువ ఎంతో వెల్లడించలేదు.
మెయిలిట్లో రతన్ టాటా పెట్టుబడి
కొరియర్, కార్గో సేవల్లో నిమగ్నమైన మెయిల్రూమ్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ కంపెనీ ‘మెయిలిట్’లో టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. కానీ ఎంత పెట్టుబడి పెట్టిందీ వెల్లడికాలేదు. రానున్న ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 500 మెయిల్రూమ్లను ప్రారంభించడంతోపాటు పూర్తిస్థాయి మెకనైజ్డ్ వేర్హౌస్ను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మెయిలిట్ తెలిపింది.