న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టాటా గ్రూప్ నాయకత్వంలో ఎటువంటి నిర్మాణాత్మక మార్పుల్లేవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం స్పష్టం చేశారు. టాటా గ్రూప్లో మునుపెన్నడూ లేనివిధంగా నాయకత్వ నిర్మాణ మార్పులు జరుగబోతున్నాయని బ్లూంబర్గ్లో వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా తేల్చిచెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపర్చడానికి ప్రత్యేకంగా ఓ సీఈవో స్థానాన్నే తీసుకురావాలనే యోచనలో టాటా గ్రూప్ ఉన్నట్లు బ్లూంబర్గ్ సదరు కథనంలో పేర్కొన్నది. అంతేగాక ప్రస్తుత చైర్మన్కు తర్వాతి హోదాలో ఈ కొత్త సీఈవో ఉంటారని చెప్పింది. ఈ క్రమంలో ఇలాంటి నిర్ణయాలు అషామాషీగా జరుగవని, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ బోర్డు నిర్ణయిస్తుందని చంద్రశేఖరన్ ఓ తాజా ప్రకటనలో వివరించారు. ఇలాంటి వార్తలు సంస్థలో గందరగోళం సృష్టిస్తాయని, పనితీరును ప్రభావితం చేస్తాయన్న ఆయన బ్లూంబర్గ్ వార్తపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. టాటా ట్రస్టుల అధిపతి రతన్ టాటా సైతం ఇటువంటి వదంతులు ఎంతమాత్రం మంచివి కావంటూ తన అసంతృప్తిని కనబర్చారు.