శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ నిర్వహించినట్లు నార్తర్న్ కమాండ్ తెలిపింది. మల్హూరా పరింపొరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారి నుంచి రెండు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు నార్తన్ కమాండ్ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్ఓసీకి సమీపంలో ఉన్న దాదల్గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.