ముంబై: టాటా సన్స్ అనుబంధ సంస్థ తాజ్ హోటల్ గ్రూప్స్కు అరుదైన రికార్డు లభించింది. ఈ హోటల్ గ్రూప్ శక్తిమంతమైన హోటల్ బ్రాండ్గా నిలిచిందని లండన్ కేంద్రంగా పని చేస్తున్న బ్రాండ్ ఫైనాన్స్ అనే కన్సల్టెన్సీ పేర్కొంది. ఈ విషయమై బ్రాండ్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ..హోటల్స్-50 2021.. ఓ నివేదికను విడుదల చేసింది.
ఈ విషయమై బ్రాండ్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ నిర్వహించిన సర్వేలో తాజ్ హోటల్స్ గ్రూప్ 100కు 89.3 పాయింట్లు సాధించింది. దీంతో ఏఏఏ రేటింగ్ కూడా పొందింది. బ్రాండ్ ఫైనాన్స్ అండ్ కన్సల్టెన్సీ ఈ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన, శక్తిమంతమైన బ్రాండ్లను గుర్తించింది.
తమ తాజ్ బ్రాండ్ హోటళ్లలోనే అతి శక్తిమంతమైనదిగా గుర్తింపు పొందిందని ఇండియా హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) పేర్కొంది. ఇండియా హోటల్స్ టాటా గ్రూప్లో ఒక భాగం.
దీనిపై ఐహెచ్సీఎల్ ఎండీ, సీఈవో పునీత్ ఛాత్వాల్ స్పందిస్తూ.. ‘తాజ్ బ్రాండ్ అతి శక్తిమంతమైందిగా గుర్తింపు రావడం మాపై కస్టమర్లు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. అతిథులకు ప్రపంచ స్థాయి విలాసవంతమైన అనుభవాన్ని, ఆతిథ్యాన్నదించేందుకు కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.
బ్రాండ్ ఫైనాన్స్ కన్సల్టెన్సీ సీఈవో డేవిడ్ హైజ్ మాట్లాడుతూ.. వందేండ్ల నాటి తాజ్ బ్రాండ్ కోవిడ్-19 మహమ్మారిని కూడా తట్టుకొని బలంగా నిలిచిందన్నారు. ప్రపంచ పర్యాటకులు సందర్శించి , బ్రాండ్లను పరీక్షించిన తర్వాత తాజ్ అగ్రస్థానానికి చేరిందన్నారు.