కరోనా వైరస్ ప్రభావంతో పడిపోయిన వృద్ధిరేటును నిలబెట్టడమే ఇప్పుడు ఆర్బీఐకి ప్రధానం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి దేనికైనా సిద్ధం. ద్రవ్యోల్బణం అదుపు కూడా కీలకమే. దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఆర్థిక ప్రగతిపై అనిశ్చితిని ఏర్పడేలా చేస్తున్నాయి. దీంతో కరోనా వ్యాప్తిని అరికట్టడం, జీడీపీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఉత్పాదక రంగాలకు కావాల్సినన్ని రుణాలు అందేలా ద్రవ్య వ్యవస్థను సంసిద్ధం చేస్తాం. ఆర్థిక సుస్థిరతను సంరక్షించడానికి, ప్రభుత్వ రుణ సమీకరణకు ఆర్బీఐ కృషి చేస్తుంది.
ముంబై, ఏప్రిల్ 7: దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండటం, ఆయా రాష్ర్టాల్లో పాక్షిక లాక్డౌన్లు మొదలైన నేపథ్యంలో రుణాలపై మళ్లీ మారటోరియం అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగానే సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ సెకం డ్ వేవ్ మధ్య మారటోరియం అవకాశాలను కొట్టిపారేశారు. కొవిడ్-19 దృష్ట్యా గతేడాది అన్ని రుణా ల చెల్లింపులపై 6 నెలల మారటోరి యం వెసులుబాటు ను ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. అయితే నాటికి నేటికి ఎంతో వ్యత్యాసం ఉందన్న దాస్.. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి సంస్థలు, వ్యాపారులు మెరుగ్గా సన్నద్ధమయ్యారన్నారు. కాగా, గత నెల సుప్రీం కోర్టు ఆదేశా నుసారం రుణగ్రహీతలకు మారటోరియం చక్రవడ్డీ ని రిఫండ్ చేయాలని బ్యాంకులు ఎన్బీఎఫ్సీ లకు సూచించారు.
ఐదోసారీ అంతే
రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను వరుసగా ఐదోసారి ఆర్బీఐ యథాతథంగానే కొనసాగించిం ది. గత నాలుగు ద్రవ్యసమీక్షల్లో వీటి జోలికి వెళ్లని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ.. ఈసారి కూడా వెళ్లకూడదనే ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నది. గతేడాది రెపోను 115 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏప్రిల్-జూన్లో రూ.లక్ష కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనేందుకు సిద్ధమయ్యామని దాస్ తెలిపారు. ఈ 15 నుంచి తొలి విడుతగా రూ.25వేల కోట్ల బాండ్ల కొనుగోళ్లను ప్రారంభిస్తామని చెప్పారు.
రూ.2 లక్షలకు పెంపు
పేమెంట్స్ బ్యాంకుల కోసం ప్రతీ వ్యక్తిగత కస్టమర్ గరిష్ఠ బ్యాలెన్స్ పరిమితిని లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. పీపీఐలు, కార్డ్ నెట్వర్క్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తదితర నాన్ బ్యాంక్ పేమెంట్ సిస్టం ఆపరేటర్లతో ఆర్టీజీఎస్, నెఫ్ట్ కనెక్టివిటీకి అనుమతినిచ్చింది. ఫలితంగా వీటి వినియోగదారులకు నగదు లావాదేవీలు మరింత సులువు కానున్నాయి.
రాష్ర్టాలకు ఊరట
కరోనా నేపథ్యంలో ఆదాయ-వ్యయాల్లో తేడాలను చవిచూస్తున్న రాష్ర్టాలకు ఊరటనిస్తూ రూ.51,560 కోట్ల మధ్యంతర డబ్ల్యూఎంఏల పరిమితిని ఆర్బీఐ సెప్టెంబర్దాకా పొడిగించింది. రాబడి తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో రాష్ర్టాలకు ఆర్బీఐ ఇచ్చే తాత్కాలిక రుణాలే ఈ డబ్ల్యూఎంఏలు. కాగా, రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం డబ్ల్యూఎంఏ పరిమితిని రూ.32,225 కోట్ల నుంచి 47,010 కోట్లకు ఆర్బీఐ పెంచింది.
‘మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని ఆర్బీఐ తొలగించే దిశగా ముందుకెళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లు, టీఎల్టీఆర్వో, పీఎస్ఎల్ నిర్ణయాలు బాగున్నాయి’
-దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
‘పరిశ్రమ, వాణిజ్యానికి భరోసా ఇచ్చేలా ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరి ఉన్నది. అటు వృద్ధిరేటును, ఇటు ద్రవ్యోల్బణం అదుపును దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం’
-అసోచామ్
‘కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచడాన్ని స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పలు రంగాలకు ఆర్బీఐ ఆర్థిక సాయం అందివ్వడం హర్షణీయం’
–ఫిక్కీ
సమీక్షలో ముఖ్యాంశాలు
4 శాతంగా రెపో రేటు, రివర్స్ రెపో 3.35%
2021-22లో జీడీపీ అంచనా 10.5%
ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్
ద్రవ్యోల్బణం 4.4-5.2%గా అంచనా
2021-22 రుణాల కోసం నాబార్డు,
ఎన్హెచ్బీ, సిడ్బీలకు రూ.50వేల కోట్ల
అదనపు నిధులు
ఏఆర్సీల పనితీరుపై సమగ్ర
సమీక్షకు కమిటీ