న్యూఢిల్లీ: ఆటోమొబైల్.. స్మార్ట్ ఫోన్లు.. టాబ్లెట్స్.. పర్సనల్ కంప్యూటర్స్.. టీవీల ధరలు.. ప్రత్యేకించి కార్ల ధరలు మరింత పెరుగనున్నాయి. ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయం పెరిగిందని దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు మూడుసార్లు తమ కార్ల ధరలు పెంచేశాయి. మరోమారు ఇన్పుట్ వ్యయం వినియోగదారులపై పడబోతున్నది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఎలక్ట్రానిక్ డివైజెస్కు గిరాకీ ఎక్కువైంది. ఇది ఆటోమొబైల్ రంగంపై దారుణంగా ప్రభావం చూపింది. మోడ్రన్ కార్లలోని పలు వ్యవస్థలు పని చేయాలంటే చిప్స్ చాలా కీలకం. చిప్స్ కొరత పుణ్యమా? అని పలు ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేశాయి. మున్ముందు డిమాండ్ను అందుకోవాలంటే అధిక ధరలకు సెమీ కండక్టర్లు, చిప్లను సేకరించాల్సి రావచ్చు. అదే జరిగితే కార్ల కొనుగోలుదారులపై మరింత భారం పడటం ఖాయం అని తెలుస్తోంది.
ఆటోమొబైల్ సంస్థలు చిప్ల కొరత ప్రభావాన్ని తొలుత తక్కువ చేసి చూపాయి. ఇది చాలా మైనర్ సమస్య అని అంచనా వేశాయి. కానీ కరోనా నుంచి రికవరీ సాధిస్తున్నా కొద్దీ చిప్ల కొరత తీవ్రత బయటపడుతోంది. దీనికి తోడు పెట్రోల్-డీజిల్ ఆధారిత ఇంధన వినియోగం నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లాలన్న ఆకాంక్షలు, ప్రభుత్వాల నిర్ణయాలతో విద్యుత్ కార్లకు గిరాకీ పెరుగుతున్నది. ఇక వాటి తయారీ కోసం కూడా సెమీ కండక్టర్లకు భారీ డిమాండ్ వస్తుంది.
ప్రపంచంలోకెల్లా అత్యధికంగా సెమీ కండక్టర్లను తయారు చేస్తున్న ఫ్రాన్స్ సంస్థ సోయిటెక్ సీఈవో పాల్ బౌడ్రే మాత్రం చిప్ల కొరత ఆరు నుంచి తొమ్మిది త్రైమాసికాలు.. అంటే 2023 వరకు ఆటోమొబైల్ రంగాన్ని వెంటాడుతుందని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో అధిక ఉత్పత్తి సామర్థ్యం గల సెమీ కండక్టర్ల సప్లయ్ చైన్ కోసం ఆటోమొబైల్ రంగం వెతుకులాడుతుందన్నారు. అధిక మొత్తంలో సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలంటే మొత్తం సప్లయ్ చైన్ను రీ బ్యాలెన్స్ చేయాలంటే టైం పడుతుందన్నారు.