న్యూఢిల్లీ, ఆగస్టు 30: టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేనంత అధికంగా పన్నులు, సుంకాలు ఇండియాలో ఉన్నాయని, ప్రస్తుత దేశీ టెలికాం రంగ వెతలకు కేంద్ర ప్రభుత్వ పన్ను విధానాల కారణమని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. సోమవారం ఇన్వెస్టర్లతో ఇన్వెసర్లతో కాన్ఫెరెన్స్కాల్లో ఆయన మాట్లాడుతూ తాము సంపాదించే రూ.100లో రూ.35 ప్రభుత్వమే తీసుకుంటున్నదన్నారు. ఏజీఆర్, స్పెక్ట్రమ్ చెల్లింపులు సైతం భారీగా ఉండటంతో కంపెనీల రుణభారం పెరిగిపోయిందని మిట్టల్ చెప్పారు. పరిశ్రమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు. టెలికాం పరిశ్రమపై ప్రభుత్వం మోపిన భారం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది 5జీ సర్వీసు..
దేశంలో 5జీ టెలికాం సర్వీసులు 2022-23 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు సునీల్ మిట్టల్ వెల్లడించారు. 5జీ స్పెక్ట్రం కోసం వేలం వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగవచ్చని అంచనావేస్తున్నామని, ఈ ప్రకారం ద్వితీయార్థంలో సర్వీసులు మొదలుకావొచ్చన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల సమీకరించాలన్న కంపెనీ ప్రణాళిక కారణంగా 5జీ సర్వీసులకు భారీ పెట్టుబడులు చేయడానికి అవకాశం లభించిందని ఆయన చెప్పారు. 5జీ, ఫైబర్, డేటాసెంటర్ వ్యాపారాల్లోకి ఈ పెట్టుబడుల్ని మళ్లిస్తామని ఆయన వెల్లడించారు.
రైట్స్ ఇష్యూ ధర రూ.535
రూ.535 ధరతో రైట్స్ ఇష్యూ జారీచేసి రూ.21,000 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు ఆదివారం భారతి ఎయిర్టెల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్వెస్టర్లు వారివద్దనున్న ప్రతీ 14 ఈక్విటీ షేర్లకు ఒక్కో ఈక్విటీ షేరు రైట్స్ ప్రాతిపదికన లభిస్తుంది.
చార్జీల పెంపునకు వెనుకాడం..
పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టెలికాం చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని, తగిన సమయంలో వీటిని పెంచేందుకు వెనుకాడబోమని ఎయిర్టెల్ చైర్మన్ తెలిపారు. సమయం వచ్చినపుడు చార్జీలను క్రమేపీ పెంచుతామని చెప్పారు. జనం నెలకు సగటున 16 జీబీల డేటా వాడుతున్నారని, పరిశ్రమ మనుగడ సాధించడానికి టారీఫ్లు పెంచాల్సిన తరుణమిదేనని మిట్టల్ అన్నారు. కొంతమంది రూ.100తో కొంత డేటానే వాడుతున్నారని, మరికొంతమంది రూ.600-800తో పలు డేటా సేవల్ని ఆస్వాదిస్తున్నారని, అయినప్పటికీ ప్రపంచంలో ఇంత తక్కువ టారీఫ్ మరెక్కడా లేదన్నారు. టెక్నాలజీని మరింత విస్తరించడానికి, నెట్వర్క్లను పెంచడానికి మూలధనంపై తగిన రాబడి ఉండాలని, ఇందుకోసమే తాము బేస్ టారీఫ్ను రూ.79కు పెంచడం ద్వారా తొలిఅడుగు వేసామన్నారు. ఇది తర్వాతి రోజుల్లో రూ.99కు పెరుగుతుందని ఆయన సూచనాప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.200 ఏపీఆర్యూ (ఒక్కో వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం) సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, క్రమేపీ దీనిని రూ.300 వరకూ పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆయన వివరించారు.