కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి గత ఏడాది కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ ఏడాది ఆక్సిజన్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ లేక ఎవరు చనిపోకూడదనే గొప్ప సంకల్పంతో.. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ని స్థాపించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే పలు జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు కాగా, ఇవి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ ఫుల్గా ముందుకు తీసుకెళుతున్న అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా శుభాభినందనలు తెలిపారు చరణ్. ‘‘అభిమానులు ఈ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయడం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరుపేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు..’’ అని చరణ్ ఈ లేఖలో తెలిపారు.