ముంబై, జూన్ 9: కొద్దిరోజులుగా జరుగుతున్న ర్యాలీ నుంచి ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో బుధవారం స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 334 పాయింట్ల నష్టంతో 51,941 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 105 పాయింట్ల నష్టంతో 15,635 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీనట్రెండ్ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా షేర్లలో విక్రయాలు జరిగినట్లు ట్రేడర్లు చెప్పారు. సెన్సెక్స్-30 షేర్లలో లార్సన్ అండ్ టుబ్రో అత్యధికంగా 1.8 శాతం నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, మారుతి, యాక్సిస్బ్యాంక్, బజాజ్ ఆటోలు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టైటాన్, హెచ్సీఎల్ టెక్, ఆసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. ఒక్క పవర్ ఇండెక్స్ మినహా మిగిలిన రంగాల సూచీలన్నీ నష్టాలతో ముగిసాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు 1 శాతం చొప్పున నష్టపోయాయి.