బీజీ కొత్తూరు వద్ద పంపుహౌస్లను డ్రై రన్కు సిద్ధం చేయండి
సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్
మణుగూరు, మే 11: అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద చేపట్టిన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాపర్డ్యాం కాంక్రీట్ పనులను ఈ నెలాఖరు వరకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి హెలిక్యాఫ్టర్లో ఉదయం 10.38 గంటలకు మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. జలవనరులశాఖ ఇంజినీరింగ్ అధికారులు, ఎల్అండ్టీ ఏజెన్సీలతో సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల పథకం, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ నిర్మాణ పనులపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు, జలవనరుల ఇంజినీరింగ్ అధికారులను పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ 36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి సమృద్ధిగా సాగు నీరందించేందుకు నీటినిల్వ సామర్థ్యం కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా రానున్న వ్యవసాయ సీజన్కు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో మెయిన్ కెనాల్ ద్వారా సాగునీరిచ్చి అన్ని చెరువులు, కుంటలు నీటితో నింపనున్నట్లు తెలిపారు. బీజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకానికి రెండు పంపుహౌస్లు ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ నెలాఖరు వరకు మూడు పంపుహౌస్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం డ్రైరన్ నిర్వహణకు సిద్ధం చేయాలన్నారు.
పనులు జాప్యం జరగకుండా టైం టు టైం జరిగేందుకు షెడ్యూల్ నిర్ధేశించి పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. సీతమ్మ సాగర్ బహుళార్థ ప్రాజెక్టుకు రేడియల్ గేట్లతో బ్యారేజీ నిర్మించడం, బ్యారేజీకి రక్షణతో ఇరువైపులా గైడ్బండ్లు ఏర్పాటుకు ప్రభుత్వ పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. కుడి గైడ్ బండ్కు 40.608, ఎడమ గైడ్బండ్కు 55.822 కి.మీ పొడవుతో వరదనీటిని సంరక్షించి బ్యారేజీ నుంచి సీతారామ ఎత్తిపోతల పథకానికి మళ్లించడానికి ప్రాజెక్టు ఏర్పాటు జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేసి ఇరిగేషన్ అధికారులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, కలెక్టర్ ఎంవీ.రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీఈలు శంకర్నాయక్, శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు వెంకటేశ్వరరెడ్డి, ఆనంద్కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఎల్అండ్టీ జనరల్ మేనేజర్ చౌహాన్ పాల్గొన్నారు.