Stock Market | ముంబై, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం జరిగిన స్పెషల్ ట్రేడింగ్లోనూ ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించాయి. ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా చేపట్టిన రెండు సెషన్లలో సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. కాగా, ప్రైమరీ (పీఆర్) సైట్లో వైఫల్యం లేదా పెను అంతరాయం ఏర్పడినప్పుడు దాన్ని ఎదుర్కొనే సంసిద్ధతను పరీక్షించడానికి అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లను చేపట్టారు. వీటిలో భాగంగానే ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ (డీఆర్) సైట్కు స్పెషల్ లైవ్ ట్రేడింగ్ను మార్చి టెస్ట్ చేశారు.
తొలి సెషన్లో..
తొలి సెషన్లో భాగంగా ప్రైమరీ (పీఆర్) సైట్లో ఉదయం 9:15 గంటలకు ప్రత్యేక ట్రేడింగ్ ఆరంభమైంది. 45 నిమిషాలపాటు సాగిన ఈ ట్రేడింగ్ 10 గంటలకు ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 114.91 పాయింట్లు లేదా 0.16 శాతం ఎగిసి 73,860.26 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 73,982.12 స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 56.25 పాయింట్లు లేదా 0.25 శాతం ఎగబాకి 22,395 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో 22,420.25 స్థాయిని చేరింది. ఇదే నిఫ్టీకి ఇంట్రా-డే హై రికార్డు కావడం గమనార్హం.
రెండో సెషన్లో..
రెండో సెషన్లో భాగంగా డిజాస్టర్ రికవరీ (డీఆర్) సైట్లో ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక ట్రేడింగ్ మొదలైంది. గంటపాటు జరిగిన ఈ ట్రేడింగ్ మధ్యాహ్నం 12:30 గంటలకు అయిపోయింది. తొలి సెషన్లో ఎక్కడైతే సూచీలు ముగిశాయో అక్కడి నుంచే రెండో సెషన్లో ట్రేడింగ్ ఆరంభమైంది. అయితే మొదటి సెషన్తో పోల్చితే రెండో సెషన్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. ఈ క్రమంలోనే సూచీలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ మునుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ 73,806.15 పాయింట్ల ఆల్టైమ్ హై వద్ద ముగిసింది. ఇంట్రా-డేలోనూ 73,994.70 స్థాయికి చేరి రికార్డును సృష్టించింది.
నిఫ్టీ కూడా 22,378.40 పాయింట్ల లైఫ్టైమ్ హై వద్ద స్థిరపడింది. దీంతో శుక్రవారం ముగింపుతో చూస్తే సెన్సెక్స్ 60.80 పాయింట్లు లేదా 0.08 శాతం, నిఫ్టీ 39.65 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగినైట్టెంది. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘనకుగాను ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) వేసిన 5.49 కోట్ల జరిమానాతో పేటీఎం షేర్లు శనివారం 2.50 శాతానికిపైగా నష్టపోయాయి.
రూ.2 లక్షల కోట్లు జూమ్
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.394.06 లక్షల కోట్లకు చేరింది. ఈ ఒక్కరోజే సుమారు రూ.2 లక్షల కోట్లు ఎగిసింది. టాటా స్టీల్, టాటా మోటర్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, విప్రో, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్లు ఆకర్షణీయ లాభాలను అందుకున్నాయి. రంగాలవారీగా మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, హెల్త్కేర్ ఇండెక్స్లు 1.44 శాతం నుంచి 0.75 శాతం వరకు పెరిగాయి. ఇక బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.70 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.67 శాతం పెరిగాయి.