ముంబై, జూన్7: స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు తగ్గుతుండటం, మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నియంత్రణల్ని సడలిస్తుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ మరో నూతన శిఖరానికి చేరుకున్నది. ఇంధన, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్ల నుంచి లభించిన కొనుగోళ్ళ మద్దతుతో సూచీ 228.46 పాయింట్లు లాభపడి 52,328.51 వద్ద ముగిసింది. సెన్సెక్స్ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి కావ డం గమనార్హం. నిఫ్టీ 81.40 పాయింట్లు అందుకొని 15,751.65 వద్ద ముగిసింది. 30 షేర్ల ఇండెక్స్లో పవర్గ్రిడ్ కార్పొరేషన్ 4.4 శాతం లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్, లార్సన్ అండ్ టుబ్రోలు మూడు శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఓఎన్జీసీల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. రంగాలవారీగా చూస్తే యుటిలిటీ, పవర్, టెలికం, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్, ఇండస్ట్రియల్, ఐటీ రంగ షేర్లు మూడు శాతానికి పైగా లాభపడగా.. రియల్టీ, ఫైనాన్స్, మెటల్ రంగ షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి.
మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దవుతున్నారు. వరుసగా సూచీలు లాభపడుతుండటంతో వారి సంపద కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 12 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.229 లక్షల కోట్లకు చేరుకున్నది. ఇది కూడా చారిత్రక గరిష్ఠ స్థాయి. గత 12 రోజుల్లో సెన్సెక్స్ 5.58 శాతం లాభపడగా, నిఫ్టీ 5.74 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి.