హైదరాబాద్ : రాష్ట్రంలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో విజయవంతంగా అమలు కావడానికి గ్రామ కార్యదర్శులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బంజారాహిల్స్ మినిష్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ బాధ్యులు పీ.ఆర్.సి. అమలు గురించి మంత్రికి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో కేవలం 3,396 గ్రామ కార్యదర్శులు ఉండగా, ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక కార్యదర్శి ఉండాలనే సంకల్పంతో 9,355 మందిని కాంట్రాక్టు పద్ధతిపై న రెండేండ్ల క్రితం నియమించామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు.
నిర్ణీత గడువు పూర్తి కాగానే వారికి న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. జూలై 1వ తేదీ నుంచి 10 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.