న్యూఢిల్లీ: మీరు కొత్త కారు కొనుగోలు చేయాలని తలపోస్తున్నారా.. సోనీ ప్లేస్టేషన్5 సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా.. అయితే, మీరు అందుకోసం వేచి ఉండాల్సిందే.. ఎందుకంటారా?! చిప్లు, సెమీ కండక్టర్ల కొరతే దీనికి కారణం.
కారు బుక్ చేసుకున్నా..
కొత్త కారు బుక్ చేసుకున్నా, ఆరు నెలలు వెయిట్ చేయాలి.. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిలో లాప్టాప్ తప్పనిసరి.. కొన్ని నెలలుగా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నా.. ఔట్ ఆఫ్ స్టాక్ అనే రిప్లయి వస్తున్నది.
ప్రతి పరిశ్రమకు ఇబ్బందులే
అంతెందుకు… ఇప్పుడు టూత్ బ్రష్ నుంచి కారు వరకు ఏది కొనాలన్నా చిప్లు, సెమీ కండక్టర్లు అవసరం. ప్రపంచవ్యాప్తంగా చిప్ల కోసం సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు.. వ్యాపార వర్గాల నుంచి అన్ని రంగాల పరిశ్రమల వరకు ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
చిప్లు సెమీ కండక్టర్లు ఇలా కీలకం
ఇంతకుముందు టీవీలు.. తర్వాత కంప్యూటర్లు.. అటుపై స్మార్ట్ ఫోన్లలో సెమీ కండక్టర్లు, చిప్ల వాడకం తప్పనిసరి. టెక్నాలజీ డెవలప్ అయినా కొద్దీ.. ఆటోమొబైల్ రంగంలో ఇటు టూ వీలర్స్ నుంచి ప్రయాణ కార్ల వరకు చిప్లు, సెమీ కండకర్లు కీలకం..
క్రిప్టో కరెన్సీ సంస్థల నుంచి భారీగా ఆర్డర్లు
సెమీ కండక్టర్లు, చిప్ల కొరతకు బిట్ కాయిన్తో సహా పలు క్రిప్టో కరెన్సీలు మైనింగ్ ఒక కారణమని తెలుస్తున్నది. క్రిప్టో కరెన్సీల ప్రాసెసింగ్కు భారీగా విద్యుత్ అవసరం. క్రిప్టో కరెన్సీల మైనింగ్ కోసం ఆయా కంపెనీలు భారీ మొత్తంలో గ్రాఫిక్స్ కార్డ్స్, ప్రాసెసర్లు కొనుగోలు చేశాయి.
క్రిప్టోలకే టీఎస్ఎంసీ 10 శాతం విక్రయం
ప్రపంచంలోనే చిప్ల తయారీలో మూడో స్థానంలో ఉన్న టీఎస్ఎంసీ తన మొత్తం సేల్స్లో 10 శాతం చిప్స్ క్రిప్టో మైనర్లకు విక్రయించిందని నోమురా రీసెర్చ్ హెడ్ సీడబ్ల్యూ చుంగ్ చెప్పారు.
సంక్షోభంలో చిప్ల పరిశ్రమ
క్రిప్టో కరెన్సీ నుంచి డిమాండ్ పెరుగుతున్న సమయంలోనే చిప్ ఇండస్ట్రీ సంక్షోభంలో చిక్కుకున్నది.
దీంతో హై ఎండ్ చిప్స్ కొరత వల్ల డిమాండ్కు అనుగుణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది.
చిప్ల కొరత ఈ ఏడాది చివరికల్లా తగ్గుని నొమురా రీసెర్చ్ హెడ్ సీడబ్ల్యూ చుంగ్ చెప్పారు.
సమస్య మామూలే కానీ..
సెమీ కండక్టర్ల కొరత ఇవ్వాల్టిది కాదు. గతంలోనూ ఉంది. ఉత్పత్తి తగ్గినప్పుడు, కొత్త కార్లు విపణిలో అడుగు పెట్టినప్పుడు ఈ సమస్య మామూలే. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది నుంచి బిట్ కాయిన్ ర్యాలీ అవుతూ వచ్చింది.
వర్క్ లేదా లెర్న్ ఫ్రం హోం కల్చర్ ఎఫెక్ట్
కోవిడ్ వల్ల వర్క్ ఫ్రం హోం, పిల్లలకు లెర్న్ ఫ్రం హోం కల్చర్ అమలులోకి వచ్చింది.
దీంతో లాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, మోడెమ్లు, వై-ఫై రూటర్లు, మొబైల్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. వీటి తయారీలో కీలకమైన చిప్లు, సెమీ కండక్టర్ల కొరత నెలకొంది.
విస్తరణ ప్రయత్నాల లోపం
బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ కోసం వచ్చిన డిమాండ్తోపాటు సెమీ కండక్టర్ల పరిశ్రమ విస్తరణకు ప్రయత్నాలు జరుగక పోవడం కూడా చిప్ల కొరతకు కారణం.
గ్లోబల్ క్లైమేట్ ఒక కారణమే
గ్లోబల్ క్లైమేట్ కూడా సెమీ కండక్టర్ల తయారీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. కరోనా మహమ్మారి పలు రంగాల పరిశ్రమల్లో గందరగోళానికి దారి తీస్తున్నది.
కరువు.. విద్యుత్ సమస్య
కరువు పరిస్థితుల వల్ల తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ), చలి వాతావరణం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. చలి వాతావరణం వల్ల ఆస్టిన్లో శామ్సంగ్ ప్రొడక్షన్ యూనిట్లలో విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఆ రెండు సంస్థలే 70 % ఉత్పత్తి
టీఎస్ఎంసీ, శామ్సంగ్ ప్రపంచవ్యాప్త అవసరాల్లో 70 శాతం సెమీ కండక్టర్లు తయారీ చేస్తాయి. కానీ తైవాన్లోని టీఎస్ఎంసీ, శామ్సంగ్ ప్రొడక్షన్ యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
ట్రంప్ హయాంలో వాణిజ్య యుద్ధం ఇలా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో చైనాతో వాణిజ్య యుద్ధం కూడా చిప్లు, సెమీ కండక్టర్ల కొరతకు దారి తీసింది. చైనా టెక్ దిగ్గజం హువావేకు చిప్లు సరఫరా చేయొద్దని అమెరికా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించారు.
హువావే, చైనా కంపెనీలు ముందస్తుగా దిగుమతి
దీంతో హువావే, ఇతర చైనా టెక్ కంపెనీలు తన 5జీ స్మార్ట్ ఫోన్లు, ఇతర టెక్ ఉత్పత్తుల కోసం గత అక్టోబర్లో వ్యూహాత్మకంగా భారీగా చిప్లు, సెమీ కండక్టర్లు దిగుమతి చేసుకున్నాయి.
అవసరాలకు తగ్గట్లు పెరగని చిప్ల ఉత్పత్తి
2000 నుంచి దాదాపు 180 శాతం ఉత్పాదక సామర్థ్యం పెరిగినా.. ప్రస్తుతం అత్యధిక వినియోగ రేటుకు అది సరిపోదని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా సెమీ కండక్టర్ల ఉత్పత్తి 4 శాతం మాత్రమే పెరిగింది.
కానీ వాడకం గత దశాబ్దిలో సుమారు 80 శాతం ఎక్కువైందని రీసెర్చ్ సంస్థ మెకెన్సీ పేర్కొంది.