హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యంత కీలకమైన స్టార్టప్స్ కేంద్రంగా హైదరాబాద్ మారే అవకాశం ఉన్నదని ‘ఫిన్టెక్ ఇండియా ఫెస్టివల్’లో భాగంగా విడుదల చేసిన ‘హైదరాబాద్- ది ఎమర్జింగ్ స్టార్టప్ హబ్ ఇన్ ఇండియా’ శ్వేతపత్రం పేర్కొంది. స్టార్టప్స్కి అనుకూలమైన అనేక అంశాలు తెలంగాణలో ఉన్నాయని, అనుకూలమైన ఎకోసిస్టంను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపింది.
కాన్స్టెల్లార్ ఆధ్వర్యంలో నీతిఆయోగ్, ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తొలి సదస్సును శుక్రవారం హైదరాబాద్ వేదికగా వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదలచేసిన శ్వేతపత్రంలో తెలంగాణలో స్టార్టప్స్ వృద్ధికి ఉన్న అనుకూలాంశాలను వివరించారు.
‘ఆవిష్కర్తలకు మద్దతు ఇచ్చేలా, తద్వారా నూతన స్టార్టప్స్ వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్ప్రేరక పాత్రను పోషిస్తున్నది. ఇందులో భాగంగా 2016లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ పాలసీని తీసుకొచ్చింది. దీంతోపాటు స్టార్టప్ ఎకోసిస్టంను పటిష్ఠం చేసేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, ఇమేజ్ టవర్, టీ-వర్క్స్, టీ-హబ్, రీచ్, టీ-ఫైబర్, టాస్క్, వీ-హబ్ వంటి ఇంక్యుబేటర్స్ని ఏర్పాటుచేసింది. ఐఐఐటీ, ఐఎస్బీ, నల్సార్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటుచేసుకొని స్టార్టప్స్కి ప్రోత్సాహం అందిస్తున్నది. దీంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు విధాలుగా మద్దతు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు క్రమక్రమంగా తెలంగాణను స్టార్టప్స్కి కేంద్రంగా మార్చుతున్నాయి’ అని పేర్కొన్నారు.
8 నెలల్లో మరిన్ని సదస్సులు
వచ్చే ఎనిమిది నెలలపాటు బెంగళూరు, ఢిల్లీ, గౌహతి, ముంబై, అహ్మదాబాద్, పుణెలలో జరిగే ఫిన్టెక్ సదస్సులలో 12 వేల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు.