న్యూఢిల్లీ : కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎయిమ్స్లో ఓపీడీ సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. రోగులు ఆన్లైన్ విధానంలో మాత్రమే చికిత్స కోసం నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండదని, చికిత్స కోసం వచ్చే రోగులు తప్పనిసరిగా కొవిడ్ నియమాలు పాటించాలని ఖచ్చితంగా పాటించాలని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
శుక్రవారం నుంచి దశల వారీగా ఓపీడీ సేవలు ప్రారంభమవుతాయని, ఆఫ్లైన్ నమోదు ఉండదని, ఓపీడీ సేవల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగులకు మాత్రమే వైద్యులు సేవలందిస్తారని చెప్పారు. ఓపీడీ సేవల కోసం సన్నాహాలు ప్రారంభించాలని ఆయా విభాగాల అధిపతులకు సూచించారు. పెరుగుతూ వస్తున్న కరోనా కేసులతో ఏప్రిల్ రెండో వారంలో ఎయిమ్స్ ఓపీడీ సేవలను నిలిపి వేసింది. దాదాపు రెండు నెలల తర్వాత శుక్రవారం నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.