కర్ణాటకలోని నటి స్వస్థలానికి వెళ్లిన తెలంగాణవాసి
మదికేరి (కర్ణాటక), జూన్ 23: ప్రముఖ నటి రష్మికా మందన్నను చూడటానికి ఓ అభిమాని ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి రష్మికాకు వీరాభిమాని. అమెను ఎలాగైనా కలుసుకోవాలని ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగుకు సమీపంలోని విరాజ్పేటకు బయల్దేరాడు. రైళ్లో మైసూరు వరకు వెళ్లిన అతను గూగుల్ సెర్చ్ సాయంతో ఓ కార్గో ఆటోలో విరాజ్పేట చేరుకున్నాడు. నటి ఇంటి అడ్రస్ కోసం పలువురిని సంప్రదించాడు. దీంతో అనుమానం వచ్చి అక్కడి స్థానికులు త్రిపాఠిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు.. కొడగులో లాక్డౌన్ ఉన్నదని, కాబట్టి వెనక్కి వెళ్లాలని త్రిపాఠికి సూచించారు. షూటింగ్ నిమిత్తం నటి కూడా ముంబైకి వెళ్లినట్టు తెలుసుకున్న అభిమాని నిరుత్సాహంతో వెనుదిరిగినట్టు సమాచారం.