హైదరాబాద్, సెప్టెంబర్ 7: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరెటరీస్ తెలిపింది. రష్యా అభివృద్ధిపర్చిన ఈ కొవిడ్-19 తొలి డోసు వాక్సిన్ను దేశవ్యాప్తంగా తమ భాగస్వామ్య హాస్పిటళ్లకు పంపిణీ చేస్తున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది.
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ లభ్యతను ప్రజలు తెలుసుకునేందుకు కంపెనీ ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) నుంచి సరఫరా అవాంతరాలు తలెత్తడంతో స్పుత్నిక్-వీ తొలిడోసు సరఫరాల్ని గతంలో డాక్టర్ రెడ్డీస్ నిలిపివేసింది. అయితే తాజాగా మరో ఫార్మా కంపెనీ పానేసియా బయోటెక్…ఆర్డీఐఫ్తో ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న స్పుత్నిక్-వీ రెండో డోసు విక్రయిస్తున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ ఈ వ్యాక్సిన్ సరఫరాలు ప్రారంభించడం గమనార్హం.
తొలి టీకా తర్వాత రెండో టీకాను అంతే పరిమాణంలో సరఫరా చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి ఈ సందర్భంగా చెప్పారు. ఇండియాలో తొలిదశగా 12.5 కోట్లమందికి 25 కోట్ల స్పుత్నిక్-వీ టీకాలను విక్రయించడానికి ఆర్డీఐఎఫ్తో గతంలో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది.