కరోనా కాలంలో కుదేలైపోయిన రంగాల్లో హోటల్ బిజినెస్ ఒకటి. తినేవాళ్లు రాక వ్యాపారం తాలింపు లేని పప్పులా తయారైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఐస్ల్యాండ్ రెస్టారెంట్ వ్యాపారి నరేశ్ మాత్రం ఆయుర్వేద అస్త్రంతో లాభాలకు గురిపెట్టాడు. రెగ్యులర్ చికెన్ బిర్యానీకి ఆయుర్వేద గుణాలు జోడించి భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాడు. లాక్డౌన్ తరుణంలోనూ వందల ఆర్డర్లు అందుకుంటూ గల్లాపెట్టెలో కాసుల గలగలలు వింటున్నాడు. సాధారణంగా బిర్యానీలో మసాలాలు బాగానే దట్టిస్తారు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇలా ఔషధ గుణాలున్న దినుసులు దండిగానే వాడుతారు. వీటికి అదనంగా శొంఠి, మిరియాలు, ఉసిరి, తులసి జతచేసి ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ చేస్తున్నాడు నరేశ్. గతేడాది లాక్డౌన్తో నరేశ్ హోటల్ బిజినెస్ బాగా దెబ్బతిన్నది. ‘ఆ నష్టాల్లో నుంచి బయటకు రావడం ఎలా?’అని బుర్రకు పదును పెట్టాడు. అప్పుడే ఈ ఆయుర్వేదిక్ బిర్యానీ ఆలోచన తట్టింది. గత జూలైలో ‘కరోనాకు ధమ్కీ ఇచ్చే చికెన్ దమ్ బిర్యానీ’ అంటూ ఆయుర్వేదిక్ బిర్యానీని రెస్టారెంట్ మెనూలో చేర్చాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారి రుచి చూశాక వదల్లేకపోతున్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు రావడం మొదలైంది. ఈసారి కరోనా మళ్లీ పుంజుకున్నా.. నరేశ్ వ్యాపారం డీలా పడలేదు. ఆర్డర్లు రెట్టింపయ్యాయి. రుచిగా ఉండటం, ఔషధ గుణాలు కలిగి ఉండటంతో డిమాండ్ పెరగడం మొదలైంది. పెండ్లిళ్లు, ఇతర వేడుకల కోసం బల్క్ ఆర్డర్లు కూడా వస్తుండటం విశేషం. రోజుకు సుమారు రెండు వందల వరకు బిర్యానీలు అమ్ముడవుతున్నాయట. ఇంతకీ ఈ ఆయుర్వేదిక్ బిర్యానీ రేటెంతో చెప్పలేదు కదూ! జస్ట్ రూ.150.