రాష్ట్రంలో నిరర్థక ఆస్తులమ్మి ప్రాజెక్టుల నిర్మాణం, దళిత జనోద్ధరణ లాంటి పథకాలు అమలు చేస్తుంటే ఊరూ వాడా ఊరేగుతూ గాయి గత్తర లేపుతున్న రాష్ట్ర బీజేపీ నేతల్లారా.. నిర్మలమ్మ ప్రకటనపై ఇప్పుడేమంటారు?
విమానాశ్రయాలు.. గనులు, రేవులు, స్టేడియంలు.. ఒకటేమిటి.. ప్రజలందరికీ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ అమ్మేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. తమది ఫక్తు అమ్మకాల పార్టీ అని మరోమారు రుజువు చేసుకుంటున్నది! మొత్తంగా ఆరు లక్షల కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ఈ అమ్మకానికి నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) అనే ముద్దుపేరు కూడా పెట్టింది. ఈ అమ్మకాలకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు అటూఇటూగా 2024-25ను గడువుగా ఎంచుకోవడం గమనార్హం.
అన్ని అమ్మేస్తాం..ఉన్నకాడికి దండుకుంటాం. అన్న తీరుగా ప్రవర్తిస్తున్నది నరేంద్ర మోదీ సర్కార్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి మొగ్గుచూపుతున్న ఎన్డీయే ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. పెట్రోల్, గ్యాస్, బ్యాంక్లు, బీమా రంగ సంస్థల్లో వాటాలను అమ్మేసి.. ప్రస్తుతం మౌలిక రంగానికి సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది.
ముంబై, ఆగస్టు 23: రోడ్లు, రోడ్లు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, విమాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్ లైన్లు, గ్యాస్పైప్లైన్లు…ఇలా ఒక్కటేమిటి? అందరికీ అవసరమైన మౌలిక సదుపాయాల్ని అన్నింటినీ అమ్మేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం సంకల్పించింది. ఈ మేరకు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) పేరుతో ఒక భారీ ప్రణాళికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు.ఈ ప్రణాళిక ద్వారా నిరుపయోగంగా ఉన్నవి, ఆధునికీకరించాల్సినవి, పునర్ నిర్మించాల్సిన మౌలిక వసతుల్ని ప్రైవేటు రంగానికి అప్పగించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం వివిధ రంగాల్లో ప్రాజెక్టుల్ని 2021-22 నుంచి 2024-25 మధ్య విక్రయించడం ద్వారా రూ. 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యమని ఆమె వివరించారు. ఈ ప్రణాళికలో ఆయా ప్రాజెక్టులు ఉన్న భూముల్ని విక్రయించడం జరగదని,ఆయా ఆస్తుల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, వాటి నిర్వహణను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు సీతారామన్ తెలిపారు.
ఎన్ఎంపీ రూపకల్పన..
మౌలిక సదుపాయాలకు నిధుల కల్పన కొనసాగడానికి ప్రభుత్వ మౌలిక ఆస్తుల్ని నగదీకరించాలని 2021-22 బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందుకు తగిన బ్రౌన్ఫీల్డ్ ఇన్ఫ్రా ఆస్తుల్ని గుర్తించేందుకు ఎన్ఎంపీని రూపొందించాలని బడ్జెట్లో నిర్ణయించారు. వివిధ ఇన్ఫ్రా మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం ఎన్ఎంపీని నీతిఆయోగ్ రూపొందించింది. దేశంలో మౌలిక వసతుల్ని అభివృద్ధిపర్చడానికి కేంద్రం గతంలో ప్రకటించిన రూ.111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ)లో 5.4 శాతం నిధులు, కేంద్రం ఈ ఎన్ఐపీ కోసం ప్రతిపాదించిన రూ. 43 లక్షల కోట్ల వ్యయంలో 14 శాతం నిధులు ఈ ఎన్ఎంపీ ద్వారా అందుతాయని అంచనావేస్తున్నారు. ఎంఎన్పీ ప్రధాన లక్ష్యం.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ‘నగదీకరణ ద్వారా మౌలిక వసతుల కల్పన’ అని, దీంతో సామాజిక-ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, పౌరుల జీవన ప్రమాణాలు పెంపొందుతాయని సీతారామన్ చెప్పారు.