న్యూఢిల్లీ: కరోనాతో అష్ట కష్టాల పాలవుతున్న రిటైల్, హోల్సేల్ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్నిచ్చింది. వీరిని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సంగతిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు తేలిగ్గా బ్యాంకు రుణాలు లభిస్తాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది రిటైల్, హోల్సేల్ వ్యాపారులు లబ్ధి పొందనున్నారు. ఎంఎస్ఎంఈ వంటి ప్రాధాన్య రంగాలకు తేలిగ్గా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ విధించిన నిబంధనలు ఉన్నాయి.
గ్రోత్ రేట్కు ఎంఎస్ఎంఈ ఇంజిన్ వంటిదని నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. కరోనా రెండో వేవ్తో ఇబ్బందుల్లో చిక్కుకున్న రిటైల్, హోల్సేల్ వ్యాపారులను ఎంఎస్ఎంఈల పరిధిలోకి తీసుకొచ్చాం. దీంతో ప్రాధాన్య రంగంగా వీరికి ఆర్థిక సాయం అందించడం తేలిక అవుతుందని గడ్కరీ పేర్కొన్నారు.
రిటైల్ ట్రేడ్ను ఎంఎస్ఎంఈల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అతి పెద్దది, చారిత్రాత్మకం అని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్) అభివర్ణించింది. ఏడాది కాలానికి పైగా ఈ అంశాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొస్తున్నట్లు కెయిట్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీసీ భార్టియా, ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను ఎంఎస్ఎంఈల పరిధిలోకి తేవడం వల్ల తక్కువ వడ్డీపై రుణాలు వస్తాయని భార్టియా, ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఎనిమిది కోట్ల మందికి పైగా చిన్న వ్యాపారులు లబ్ధి పొందుతారన్నారు.