హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభాలను అందుకున్నది. కరోనా పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రూ.303 కోట్ల నష్టాలను సంస్థ చవిచూసింది. ఇక టర్నోవర్ విషయంలోనూ సింగరేణి సంస్థ నిరుడుతో పోల్చితే ఈసారి 72 శాతం వృద్ధి సాధించింది. రూ.8,180 కోట్లను తాకింది. గతేడాది ఏప్రిల్-జూలైలో రూ.4,748 కోట్ల టర్నోవర్కే పరిమితమైంది. ఈసారి బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్లు, విద్యుత్తు విక్రయాల నుంచి (ఎస్టీపీపీ) రూ.1,231 కోట్లు గడించింది. దీంతో లాభాలూ భారీగా పెరిగాయి. కాగా, లాభాలు, టర్నోవర్ వృద్ధిపట్ల సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణీయులను అభినందించారు. సంస్థాగతంగా తీసుకున్న కరోనా నివారణ చర్యలతో కార్మికులు, అధికారులు ఆత్మ విశ్వాసంతో విధులు నిర్వర్తిస్తున్నారని, ఇందుకు తాజా గణాంకాలే నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మార్కెట్ వ్యూహాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి డిమాండ్ వస్తున్నదని తెలిపారు.