న్యూఢిల్లీ, ఆగస్టు 25: ‘గత కొన్నేండ్లుగా ఆటో పరిశ్రమలో వృద్ధిరేటు అంతకంతకూ క్షీణిస్తున్నది. ఆదుకోవాలంటూ కేంద్రాన్ని అర్థిస్తూనే ఉన్నాం. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. సర్కారీ పెద్దలు మాత్రం అది చేశాం.. ఇది చేస్తున్నాం అంటున్నారు. అన్నీ ఉత్త మాటలే. ఇది చేతల ప్రభుత్వం కానే కాదు’ అంటున్నారు దేశీయ వాహన తయారీ దిగ్గజ సంస్థల అధిపతులు. ఆటో ఇండస్ట్రీ సంఘం సియామ్ 61వ వార్షిక సమావేశంలో బుధవారం మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ, టీవీఎస్ మోటర్ సీఎండీ వేణు శ్రీనివాసన్.. మోదీ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాటల్లో చెప్తున్నది.. చేతల్లో చూపట్లేదని ఈ ఇండస్ట్రీ సీనియర్లు ఆక్షేపించడం గమనార్హం.
ఇంతింత పన్నులా..
‘ప్రభుత్వం చెప్తున్నట్లుగా భారత జీడీపీ వృద్ధికి ఆటో పరిశ్రమ ఎంతో కృషి చేస్తున్నది నిజమే అయితే.. ఇంకా లగ్జరీ ఉత్పత్తులపై వేస్తున్న పన్నును కార్లపై ఎందుకు రుద్దుతున్నారు’ అని ఈ సందర్భంగా భార్గవ నిలదీశారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దేశీయ ఆటో పరిశ్రమ విజయాలపై మాట్లాడుతూ ‘ఆటోమొబైల్ పరిశ్రమ సహకారం లేకపోతే భారత్ ఆకర్షణీయ వృద్ధి గణాంకాలు ఎంతోకాలం కొనసాగవు’ అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆర్సీ భార్గవ ఘాటుగా స్పందించారు. ‘ఆటో పరిశ్రమ ప్రాధాన్యత గురించి ఇలాంటి ప్రకటనలు చాలానే విన్నాం. కానీ ఇండస్ట్రీ సమస్యల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు అనుకూలంగా పనిచేసిన దాఖలాలు చాలా తక్కువే’ అన్నారు. వేణు శ్రీనివాసన్ సైతం ఇదే తరహా అభిప్రాయాలను వెలిబుచ్చారు. దేశ రవాణా వ్యవస్థలో కనీస సదుపాయంగా ఉన్న ద్విచక్ర వాహనాలపైనా గరిష్టంగా 28 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పడుతున్నదని గుర్తుచేశారు.
‘ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్లు కావచ్చు లేదా సీఎన్జీ, జీవ ఇంధనాలు కావచ్చు వేటితో కూడా కార్ల పరిశ్రమ బలోపేతం కాగలదని నేను అనుకోవడం లేదు. చౌక ధరలకు కార్లు ఎందుకు లభించడం లేదన్న కస్టమర్ల ప్రశ్నకు బదులు దొరికేదాకా విద్యుత్తు ఆధారిత వాహనాలుసహా ఏవీ కూడా ఆటో పరిశ్రమను ఆదుకోలేవు. ఓవైపు అధిక పన్నులు, మరోవైపు కర్బన ఉద్గారాలు, భద్రతలకు సంబంధించిన కొత్త నిబంధనల్ని అందుకునేందుకు పెడుతున్న అదనపు ఖర్చులు కార్ల ధరలను పెంచేస్తున్నాయి. ఫలితంగానే సామాన్యులకు అందకుండా కారు అన్నది సంపన్నుల వస్తువుగా మిగిలిపోతున్నది’
– మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ
‘మనకు అసలు గుర్తింపున్నదా?.. ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎందరికి ఉపాధిని ఇస్తున్నదో తెలుసా?.. విదేశీ మారకం ఆర్జనలో, ఆదాయంలో ఆటో పరిశ్రమ ఎలాంటి పాత్ర పోషిస్తున్నదో చూస్తున్నారా?.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మందికి ఉపాధినిస్తున్నది. ఒకప్పుడు దేశంలోకి విదేశాల నుంచి కార్ల దిగుమతి జరిగేది.
కానీ ఇప్పుడు ఇక్కడే డిజైనై తయారవుతున్నాయి. ప్రస్తుతం డిజైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దేశీయ కంపెనీలు, ఎన్నో బహుళజాతి కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అయినప్పటికీ ఆటో పరిశ్రమను కేంద్రం చిన్నచూపే చూస్తున్నది’
-టీవీఎస్ సీఎండీ వేణు శ్రీనివాసన్
ఈవీలకు మద్దతిస్తాం..
విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) తయారీకి పూర్తిగా కట్టుబడి ఉన్నామని భార్గవ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కూడా వాహన ధరే ప్రధాన అంశంగా నిలుస్తున్నదని, చౌకగా కస్టమర్లకు అందితేనే అమ్మకాలు, లాభాలు అని చెప్పారు. కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా.. ఎలాంటి విధానాలు అమల్లోకి తెచ్చినా ప్రయోజనం ఉండబోదన్నారు.
నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను, తయారీ రంగాన్ని ఆటో పరిశ్రమ నడిపిస్తే దేశంలో కార్ల వినియోగదారులు ప్రతీ వెయ్యి మందిలో 25 లేదా 30 నుంచి 200లకు చేరేదన్నారు. కాబట్టి ఆటో పరిశ్రమ సమస్యల్ని తీర్చి, డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇండస్ట్రీ బాగు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వస్తేనే వృద్ధికి ఆస్కారం ఉంటుందని తేల్చిచెప్పారు. ఇకనైనా ఈ ఊక దంపుడు ఉపన్యాసాలు మాని, కార్యాచరణలోకి దిగితే బాగుంటుందని మోదీ సర్కారుకు ఓ రకంగా భార్గవ చురకలంటించారు.