సింగపూర్: గ్లోబల్ ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్-ఫ్యూచర్ రిటైల్ వివాదంపై సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఎస్ఐఏసీ) వచ్చే నెల రెండో తేదీ నుంచి తుది విచారణ చేపట్టనున్నది. ఈ సంగతిని ఫ్యూచర్ కన్జూమర్ లిమిటెడ్ (ఎఫ్సీఎల్) శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్స్ రిటైల్ను విలీనం చేసేందుకు ఆ రెండు సంస్థల మధ్య రూ.24,713 కోట్ల డీల్ కుదిరింది. దీన్ని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకించింది. ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందానికి వ్యతిరేకంగా ఎస్ఐఏసీలో ఈ ఏడాది జనవరి ఐదో తేదీన పిటిషన్ దాఖలు చేసింది.
సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ముందు రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు ఫ్యూచర్ రిటైల్ తన ఫైలింగ్లో వెల్లడించింది.
సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు పరిధిని సవాల్ చేస్తూ తొలి పిటిషన్ దాఖలు చేసినట్లు ఫ్యూచర్ తెలిపింది. ఇక ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం అమలును నిలిపివేస్తూ జారీ చేసిన ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఆర్డర్ ఉపసంహరించాలని రెండో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొంది.